logo

ఈ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు!

‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు’ అని మహాత్మాగాంధీ అన్నారు.. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం.. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మద్యానికి దూరంగా ఉండటం, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి..

Published : 12 Aug 2022 03:26 IST

మహాత్ముడి ఆశయం దిశగా పయనం

అన్ని గ్రామాల్లో ఇదే స్ఫూర్తి రావాలి

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: ‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు’ అని మహాత్మాగాంధీ అన్నారు.. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం.. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మద్యానికి దూరంగా ఉండటం, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి.. ఉమ్మడి జిల్లాలో ఇలా అభివృద్ధి దిశగా సాగుతున్న పల్లెలు ఉన్నాయి.. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల వేళ ఆ పల్లెల స్ఫూర్తితో ఇతర గ్రామాలూ పయనించాల్సిన అవసరం ఉంది..


కమిటీలతో అభివృద్ధి...

వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామం రోడ్లకు ఇరువైపులా చెట్లతో ఆకట్టుకుంటుంది. చక్కటి రహదారులు. ఇంటింటికి కొళాయిలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు దర్శనమిస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా 2013 నుంచే ఈ గ్రామంలో అమలవుతున్నాయి. ఇందులో ప్రస్తుత సర్పంచి సూర్యచంద్రారెడ్డి కృషి కూడా ఉంది. గ్రామాభివృద్ధిలో రైతు కమిటీలు, పాఠశాల కమిటీ, దేవాలయ కమిటీ, విద్యాకమిటీ, పారిశుద్ధ్య నిర్వహణ కమిటీ, మద్య నిషేధ కమిటీల పాత్ర గణనీయం. ఇవి ఆయా రంగాలకు సంబంధించి చర్చలు జరుపుతూ గ్రామస్థులకు సూచనలు చేస్తాయి. రోడ్డు పక్కన స్టీలు బుట్టలు ఏర్పాటు చేశారు. రహదారులపై పడ్డ చెత్తను గ్రామస్థులే అందులో వేస్తారు. వారానికి ఒకసారి మహిళలు వీధుల్లోకి వచ్చి రోడ్లన్నీ ఊడ్చి శుభ్రం చేస్తారు. గర్భిణులు, బాలింతలకు గ్రామ పంచాయతీ తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ నిత్యం అరకిలో కూరగాయలు, పండ్లను పంపిణీ చేస్తోంది. కేంద్రం ఈ గ్రామానికి 2018-19లో నిర్మల్‌ గ్రామ పురస్కారాన్ని అందించింది.


వేలిముద్ర అంటే తెలియదు...


రాత్రి బడిలో చదువుకుంటున్న అప్పంపల్లి మహిళలు

ప్రతి గ్రామంలో కొందరైనా నిరక్షరాస్యులు ఉంటారు. వయస్సు మళ్లినవారు, రైతుల్లో ఎక్కువగా చదువుకోని వారు కనిపిస్తారు. నారాయణపేట జిల్లా అప్పంపల్లి గ్రామంలో మాత్రం వేలి ముద్ర వేసేవారు ఒక్కరూ లేరు. నలభై ఏళ్లుగా సాగుతున్న కృషి ఫలితం ఇది. 1980 ప్రాంతంలో వీఐపీ (గ్రామీణ భాగస్వామ్య సంస్థ), ఏవీజీఎస్‌ (అప్పంపల్లి గ్రామ వికాస్‌ సమితి)లు ఇందుకు ఎంతో కృషి చేశాయి. గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మికాంత్‌ రెడ్డిలు ఈ యజ్ఞంలో కీలక పాత్ర పోషించారు. అనియత విద్య, రాత్రి బడి ద్వారా కొన్నేళ్లుగా సాగిన యజ్ఞంతో ప్రస్తుతం పుస్తకాలు, దిన పత్రికలు చదివే స్థాయికి గ్రామస్థులను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏవీజీఎస్‌ ద్వారా గ్రామంలోని ప్రతి చిన్నారి పాఠశాలకు విధిగా వెళ్లేలా కృషి చేస్తున్నారు. ఆగస్టు 15న గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. 10 కంప్యూటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడానికి సమితి ముందుకు వచ్చింది. నలభై ఏళ్లుగా 100శాతం కుటుంబ నియంత్రణ అమలవుతున్న గ్రామంగానూ దీనికి గుర్తింపు ఉంది.


ఏజెన్సీ గ్రామం.. మద్యానికి దూరం


బక్కలింగయ్యపల్లి గ్రామం

నాగార్జునసాగర్‌ తిరుగుజలాలు ఆగే సమీప గ్రామం. మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతం. ఆహ్లాదపరిచే వాతావరణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా బక్కలింగయ్యపల్లి ఉంటుంది. ఆ గ్రామంలో 2016కు ముందు అర డజను మందికిపైగా క్యాన్సర్‌ బాధితులే. గ్రామస్థులకు నిరంతరం అనారోగ్య సమస్యలే. ఈ గ్రామస్థుల సమస్యకు మద్యం, తాగునీరే కారణమని అప్పటి ఎక్సైజ్‌ అధికారి నవీన్‌కుమార్‌ గుర్తించారు. 2016లో అప్పటి కలెక్టరు టీకే శ్రీదేవిని ఈ గ్రామానికి తీసుకొచ్చి పరిస్థితిని వివరించారు. గ్రామస్థులతో అవగాహన కల్పించి మద్యానికి దూరంగా ఉంటామని తీర్మానం చేయించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. దీంతో గ్రామస్థుల్లో మార్పు వచ్చి తాగుడుకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. 2016 నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలవుతోంది. నీటి సమస్యను తొలగించడానికి ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేశారు. దీంతో ఈ గ్రామంలో అనారోగ్య సమస్యలు తగ్గి పరిసరాలే కాదు.. జన జీవనం ఆహ్లాదభరితంగా మారింది.


మద్యపాన వ్యతిరేక దళం


మద్యపాన నిషేదంపై ప్రచారం నిర్వహిస్తున్న సింగోటం మహిళలు, యువకులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా సింగోటంలో 2014 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది. ఇందుకోసం గ్రామంలోని యువకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక నెహ్రూజీ యూత్‌ క్లబ్‌, ఇతర యువజన సంఘాలు, మహిళలు ఏకతాటిపై రావడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో మద్యం అనే మాట వినిపించదు. 2014లో మద్యపానం నిషేధించాలని భావించి గ్రామంలో తీర్మానం చేశారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుని తాగేవారు. రాత్రి పూట ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామంలో మద్యపాన వ్యతిరేక దళం (యాంటీ లిక్కర్‌  ఫోర్స్‌)ను ఏర్పాటు చేసుకున్నారు. కరపత్రాలతో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి మద్యం తాగరాదు అంటూ సంతకాలు సేకరించారు. మద్యం తాగే వారితో తాగమని ప్రతిజ్ఞ చేయించారు. మద్యపాన వ్యతిరేక దళం నిఘా నిరంతరం ఉండేది. ప్రస్తుతం గ్రామంలో స్వచ్ఛందంగానే ప్రతి ఒక్కరూ మద్యపానానికి దూరంగా ఉంటున్నారు. ఏటా సంక్రాంతి సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ మద్యం తాగకుండా గట్టి చర్యలను గ్రామస్థులు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని