logo

అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ క్రాంతి పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని కొర్విపాడు గ్రామంలోని రైతువేదికలో ‘రైతు దినోత్సవ’ కార్యక్రమం నిర్వహించారు.

Published : 04 Jun 2023 03:29 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ఆయుష్‌ శాఖ సంచాలకురాలు ప్రశాంతి

మానవపాడు, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ క్రాంతి పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని కొర్విపాడు గ్రామంలోని రైతువేదికలో ‘రైతు దినోత్సవ’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఆయుష్‌ శాఖ సంచాలకురాలు, ఐఏఎస్‌ అధికారిణి ప్రశాంతి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎండ్లబండిపై డప్పులు, కోలాహలం మధ్య రైతులు, వివిధ గ్రామాల ప్రజలతో కలిసి అతిథులు రైతువేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులు ఆరుతడి పంటలైన కంది, పత్తి, ఆయిల్‌పామ్‌ సాగు చేయడం వల్ల అధిక లాభాలు ఉంటాయన్నారు. ఆయుష్‌ శాఖ సంచాలకురాలు, ఐఏఎస్‌ అధికారిణి ప్రశాంతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలు ఏర్పాటు చేసి, వ్యవసాయ శాఖ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆర్డీఎస్‌తో పాటు తుమ్మిళ్ల రిజర్వాయర్‌ నుంచి మల్లమ్మకుంట వరకు నీటిపారుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కొర్విపాడు గ్రామంలో రూ.65 లక్షలతో సీసీ రోడ్లు వేశామని తెలిపారు. అనంతరం ఉత్తమ రైతులను అతిథులు శాలువ, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌రెడ్డి, సర్పంచులు శ్రీనివాసులు, పరుచూరి ఉషారాణి, డీఏవో గోవిందునాయక్‌, ఏపీడీ నాగేంద్ర, ఎంపీడీవో రమణారావు, ఏపీఎం కోటేశ్వరి, రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త వెంకటేశ్వర్లు, భారాస మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని