logo

అత్యంత కచ్చితత్వంతో వర్షపాత అంచనా

అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది.

Published : 04 Feb 2023 01:49 IST

ఐఐటీహెచ్‌లో రెయిన్‌డ్రాప్‌ రీసెర్చి ఫెసిలిటీ ఏర్పాటు

వాన పరిమాణంపై పరిశోధనలు

రెయిన్‌డ్రాప్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీ పరికరం

ఈనాడు, సంగారెడ్డి: అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది. వర్షపాతానికి సంబంధించి సహజ వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మైక్రోఫిజికల్‌ ప్రక్రియలపై ప్రాథమిక పరిజ్ఞానం లేకపోవడంతో సమస్య వస్తోంది. ఈ పరిస్థితుల్లో కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేలా ఐఐటీ హైదరాబాద్‌ ముందడుగు వేసినట్లు ఆ విద్యా సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రెయిన్‌డ్రాప్‌ రీసెర్చ్‌(వాన బిందువుల పరిశోధన) ఫెసిలిటీని తాజాగా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌ మూర్తి, ఆచార్యుడు విద్యాసాగర్‌లతో కలిసి నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌ శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు. వర్షపు చినుకులు పడే సమయంలో జరిగే వివిధ ప్రక్రియల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, వాతావరణ మార్పులను పసిగట్టడానికి ఈ ఫెసిలిటీ ఉపకరిస్తుందన్నారు. వర్షపాతాన్ని కచ్చితత్వంతో తెలుసుకోవడానికి ఉపకరిస్తుందని ఆచార్య బీఎస్‌మూర్తి పేర్కొన్నారు.

కీర్తిసాహు కీలక పాత్ర

కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య కీర్తి సాహు గత కొన్నేళ్లుగా ఈ అంశమై పరిశోధనలు చేసి ఈ ఫెసిలిటీని సృష్టించారు. ఇక్కడ ఏర్పాటయ్యే కేంద్రంలో 10-40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో పాటు తేమ శాతం సున్నా నుంచి సంతృప్త స్థాయి వరకు ఉండేలా ఏర్పాట్లు చేశారు. బిందువులు మేఘాల నుంచి భూమికి చేరేలోపు వివిధ పరిస్థితుల్లో, వివిధ ఎత్తుల్లో పరిమాణం, ఆకృతి ఎలా మారుతుందో తెలుసుకోవడం దీని ద్వారా సాధ్యపడుతుంది. తద్వారా ముందస్తుగా కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేస్తామని స్పష్టం చేశారు. మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) ఆధారిత డిజిటల్‌ ఇన్‌లైన్‌ హోలోగ్రఫీ సాంకేతికత వినియోగిస్తున్నామన్నారు.

ఆచార్య కీర్తిసాహు బృందంతో డాక్టర్‌ వీకే సారస్వత్‌, ఆచార్య బీఎస్‌మూర్తి, ఆచార్య విద్యాసాగర్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని