logo

ఒక్కసారి తీసుకుంటే చాలు..!

రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వీరికి ఎంప్లాయిమెంట్‌ కార్డు ఎంతో అవసరం. ఇది పొందిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాల్లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

Published : 29 Nov 2022 06:13 IST

నల్గొండ జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వీరికి ఎంప్లాయిమెంట్‌ కార్డు ఎంతో అవసరం. ఇది పొందిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాల్లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఒకసారి కార్డు తీసుకున్న వారు.. తిరిగి రెన్యూవల్‌ చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో అవి రద్దు అవుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన జాబ్‌ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31,525 మంది

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉపాధి కల్పన శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారు 31,525 మంది ఉన్నట్లు ఆధికారులు చెబుతున్నారు. వీరు ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌ కార్డు పొందారు. ఇంకా పేర్లు నమోదు చేసుకోని యువత లక్షల్లోనే ఉంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు ఉపాధి కల్పనశాఖ ద్వారానే నిర్వహించే వారు. ఆ సమయంలో కార్డు తప్పనిసరిగా చూసేవారు. సీనియారిటీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు.ఆ తర్వాత ఆ విధానాన్ని రద్దు చేయడంతో యువత ఆసక్తి చూపడం లేదు. కొన్ని కార్పొరేషన్లు మాత్రం ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా జాబ్‌కార్డు ఉండాల్సిందేననే నిబంధనలు పెడుతున్నాయి. ప్రభుత్వం కూడా జిల్లాలో జాబ్‌మేళాలు నిర్వహించి..ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందుకోసం పలు ప్రైవేటు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

రిజిస్ట్రేషన్‌ ఇలా..

నూతనంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు ఆన్‌లైన్‌లో ‌www.employment.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డు వస్తుంది. దరఖాస్తుదారుడి వివరాలన్నీ ఉపాధి కల్పన జిల్లా కార్యాలయానికి వెళ్తాయి. అక్కడ సంబంధిత అధికారులు పరిశీలన చేసి కార్డును అందిస్తారు. అభ్యర్థి జిల్లా కార్యాలయానికి పోవాల్సిన అవసరం లేదు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.అభ్యర్థుల జాబితాను ‌www.ncs.gov.in  జాతీయస్థాయి వెబ్‌సైట్‌కు బదిలీ చేస్తారు. తద్వారా ఎక్కువ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.


చెల్లుబాటు కానుంది

గతంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో పేరు నమోదు చేసుకొని నూతనంగా కార్డు తీసుకుంటే.. మూడేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకోవాలి. చాలామంది  ఆ విషయం మరిచిపోతుంటారు. కార్డు (ల్యాప్స్‌) రద్దు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న సర్కారు నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఉపాధి కల్పన కార్యాలయం నుంచి ఎంప్లాయిమెంటు కార్డు తీసుకున్న వ్యక్తికి 54 సంవత్సరాలు వచ్చే వరకు లేదా ఉద్యోగం వచ్చే వరకు కార్డు చెల్లుబాటు కానుంది.


ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నవారు జిల్లాల వారీగా ఇలా..
నల్గొండ - 18,853
సూర్యాపేట - 9,340
యాదాద్రి - 3,332


సద్వినియోగం చేసుకోవాలి
- పద్మ, నల్గొండ జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి

యువతకు జాబ్‌ కార్డులు శాశ్వత ప్రాతిపదికన అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి పొందితే 54 సంవత్సరాల వరకు వినియోగంలో ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని