Miryalaguda: శోభ ఆ అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వెళ్లింది? ఇంకా వీడని డెత్‌ మిస్టరీ

మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణో అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated : 29 May 2023 14:46 IST

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో యువతి అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం స్థానిక వైష్ణో అపార్ట్‌మెంట్‌ పైనుంచి కింద పడి దండగల శోభ (18) మృతిచెందింది. ఘటన జరిగిన రెండు రోజులు పూర్తయినా ఆమె మృతిపై మిస్టరీ వీడటం లేదు. శోభ మృతిపై పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభ ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీలో చేరాలనుకుంది. శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో బైపాస్ రోడ్డు పక్కన ఉన్న వైష్టో అపార్ట్‌మెంట్‌కు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తు వరకు శోభ వెళ్లినట్లు ఆ రికార్డుల ద్వారా పోలీసులు ధ్రువీకరించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడాలని శోభ భావిస్తే.. ఆ అపార్ట్‌మెంట్‌కే ఎందుకు వెళ్లింది? ఎవరి కోసం వెళ్లింది? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఘటన జరిగిన సమయంలో శోభ దగ్గర సెల్‌ఫోన్‌ లేదని పోలీసులు తెలిపారు. కాల్‌ రికార్డింగ్స్‌ సేకరిస్తే ఆమె మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు. శోభ మృతి విషయంలో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. దీనిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని