logo

కళాశాల.. ఇక కళకళ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం గురువారం తిరిగి ప్రారంభమవుతున్నాయి.

Published : 01 Jun 2023 03:11 IST

నడిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

నడిగూడెం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం గురువారం తిరిగి ప్రారంభమవుతున్నాయి. గతంలో జూన్‌ నెలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకే తరగతులు నిర్వహించేవారు. ఈ ఏడాది బోర్డు ఆదేశాల మేరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం ప్రారంభం నుంచే తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటర్‌ కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాలు కొనసాగుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

నమోదు పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు కంప్యూటర్లు, సైన్సు, వొకేషనల్‌ ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని బోర్డు అధికారులు జిల్లా ఇంటర్‌ విద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. నమోదు శాతాన్ని గతేడాది కంటే పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు విద్యార్థుల నమోదు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్యతోపాటు, అందిస్తున్న సౌకర్యాలు, ఆయా కళాశాలల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలతో కూడిన కరపత్రాలు, బ్యానర్లతో కళాశాలల అధ్యాపకులు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని