logo

అరకొర వైద్యం.. పరీక్షలూ గగనం

ఒంగోలు నగరం, గిద్దలూరు పట్టణం, సింగరాయకొండ గ్రామీణం, పొదిలి జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు ఒంగోలు జీజీహెచ్‌, మార్కాపురం వైద్యశాల, యర్రగొండపాలెం ప్రాంతీయ ఆసుపత్రి..

Updated : 30 Nov 2022 05:41 IST

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి
వైద్యులు, సిబ్బంది  కొరతతో సతమతం

సింగరాయకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

ప్రభుత్వ ఆసుపత్రులను సమస్యలు వేధిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతకు తోడు రోగ నిర్ధరణ పరీక్షలు, ఇతర సేవలు సరిగా అందడంలేదు. దీంతో వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌గా పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇక నిర్వహణకు నిధులు లేక వెదుక్కోవాల్సి వస్తోంది.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు;న్యూస్‌టుడే: ఒంగోలు నగరం, గిద్దలూరు పట్టణం, సింగరాయకొండ గ్రామీణం, పొదిలి
జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు ఒంగోలు జీజీహెచ్‌, మార్కాపురం వైద్యశాల, యర్రగొండపాలెం ప్రాంతీయ ఆసుపత్రి.. కనిగిరి, గిద్దలూరు, కంభం, చీమకుర్తి, దోర్నాల, దర్శి, కొండపి, పామూరు, పొదిలిలో సీహెచ్‌సీలు ఉన్నాయి. మొత్తంగా 121 మంది వైద్యాధికారులు అవసరం కాగా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లోనూ అదే పరిస్థితి. జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సరాసరి 75 వేల ఓపీలు నమోదవుతుండగా ఇన్‌ పేషెంట్లు 8 వేల వరకు ఉంటున్నారు. ఒంగోలు జీజీహెచ్‌, మార్కాపురం జిల్లా వైద్యశాలకు తాకిడి అధికంగా ఉంది.


ఉన్నది  ముగ్గురే

సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. గతంలో అయిదుగురు వైద్యులు, 14 మంది సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరి కొరతకు తోడు వసతుల లేమితో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. అత్యవసర చికిత్స అవసరమైనవారికి కందుకూరు, ఒంగోలు పంపిస్తున్నారు. గతంలో నెలకు 70 వరకు కాన్పులు జరిగేవి. ఇప్పుడు పది లోపే ఉంటున్నాయి. స్కానింగ్‌ యంత్రం మొరాయించింది. రక్త పరీక్షలు చేసే పరికరాలూ పనిచేయడంలేదు. రోజూ 120 మంది వరకు రోగులు వస్తుంటారు. ఆవరణంతా పిచ్చి మొక్కలు పెరిగి విష పురుగులు సంచరిస్తున్నాయి.


పరికరాలు ఉన్నా సిబ్బంది లేరు

పొదిలిలో చెట్టు కింద అరుగుపై కూర్చొని నిరీక్షిస్తున్న రోగులు

పొదిలి సామాజిక వైద్యశాలలో రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది ఉన్నా యంత్రాలు లేవు. ఇక్కడ 30 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఐదుగురు వైద్యులు ఉన్నారు. గర్భిణులు, మహిళలకు సేవలందించాల్సిన గైనకాలజిస్టు లేరు. మత్తు వైద్యుడు, జనరల్‌ ఫిజీషియన్‌ లేక సేవలు అందడం లేదు. కు.ని.శస్త్రచికిత్సలు సైతం ఇక్కడ చేయకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుప్రతులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎక్స్‌రే ప్లాంటు మూలన పడింది. ప్రమాదాలకు గురై చిన్నపాటి గాయాలతో ఇక్కడికి వచ్చినా ఒంగోలు సిఫారసు చేస్తున్నారు. ఫిజియోథెరపీ పరికరాలు ఉన్నా సంబంధిత నిపుణుడు లేరు. ఓపీకి వచ్చినవారు వేచి చూసేందుకు వసతులు లేక చెట్ల కింద ఉంటున్నారు.


ఇరుకు గదితో  అవస్థలు

గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలలో ప్రస్తుతం 26 రకాల రోగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ నూతన భవనం నిర్మిస్తుండటంతో ఓ చిన్నపాటి గదిలో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్‌, ఆర్‌బీసీ, పీసీవీ, టీసీ, డీసీ, ప్లేట్‌లెట్‌, ఈఎస్‌ఆర్‌, ఆర్‌బీఎస్‌, క్రియాటిన్‌, బ్లడ్‌ యూరియా, హెచ్‌బీఎస్‌, హెచ్‌సీవీ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, యూరిన్‌ షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు.


జీజీహెచ్‌.. ఔషధాలకూ కష్టమే

ఒంగోలు సర్వజన ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కింద రావాల్సిన నిధులు ఏడాదిగా నిలిచిపోయాయి. ఆడిట్‌ జరగక ఖాతాల్లో ఉన్న నిధులు వినియోగించుకునేందుకు సాంకేతిక చిక్కులొచ్చాయి. ఫలితంగా వైద్య సామగ్రి, అత్యవసర మందుల కొనుగోలుకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రయోగశాలలో రీ ఏజంట్లు (రసాయనాలు) కొనుగోలు సకాలంలో జరగడంలేదు. కేంద్రీయ ఔషధశాల ద్వారా సరఫరా కాని మందులను స్థానిక ఏజన్సీల ద్వారా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్‌) నిధులను వినియోగించుకోవచ్చు. గతంలో సరఫరా చేసిన ఏజన్సీకి బకాయిలు ఉండటంతో సరఫరా చేయడానికి వారు ముందుకు రావడంలేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిధులతో తక్కువ మొత్తాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల తరచూ వ్యాధి నిర్ధరణ పరీక్షలకు ఇబ్బందవుతోంది. నిపుణులైన వైద్యుల కొరత వల్ల సమస్యాత్మక కేసులను గుంటూరు జనరల్‌ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఇక్కడ దాదాపు 100 మంది వైద్యులు అవసరం కాగా ప్రస్తుతం 60 మంది వరకు ఉన్నారు. ఆప్తమాలజీ( నేత్రవైద్యం) విభాగంలో ప్రొఫెసర్‌, ఇద్దరు అసోసియేట్‌, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం కాగా ముగ్గురే ఉన్నారు. వారు ఓపీలకే పరిమితమయ్యారు. గత కొంతకాలంగా శుక్లాల శస్త్రచికిత్సలు జరగడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని