logo

ఉద్యాన రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం

ఉద్యాన పంట ఉత్పత్తుల నాణ్యత కాపాడేందుకు పొలాల్లోనే కలెక్షన్‌ సెంటర్లు, శీతల నిల్వ గదులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యానశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 02:05 IST

సమీక్షిస్తున్న రాష్ట్ర అదనపు సంచాలకుడు వెంకటేశ్వర్లు, చిత్రంలో జిల్లా అధికారులు రవీంద్రబాబు, గోపీచంద్‌

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉద్యాన పంట ఉత్పత్తుల నాణ్యత కాపాడేందుకు పొలాల్లోనే కలెక్షన్‌ సెంటర్లు, శీతల నిల్వ గదులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యానశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఒంగోలు డివిజన్‌లోని పలు గ్రామాల్లో సాగులో ఉన్న మిర్చి, కూరగాయల తోటలను గురువారం పరిశీలించారు. అనంతరం ఏడీ కార్యాలయంలో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రాయితీ పథకాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోతే... నిధులు మురిగిపోకుండా ఇతర మండలాలకు కేటాయించాలన్నారు. కూరగాయలు, పండ్ల సాగు రైతులు వాటిని మార్కెట్‌ చేసేలోపే కొంతమేర పాడైపోతున్నందున... సమస్యను అధిగమించేందుకు రైతులకు 75 శాతం రాయితీపై కలెక్షన్‌ సెంటర్లు, శీతల నిల్వ గదులు మంజూరు చేస్తున్నామన్నారు. వీటి ఏర్పాటుకు వరుసగా రూ.15 లక్షలు, రూ.11.25 లక్షలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. సౌర, సాధారణ విద్యుత్తుకు వేర్వేరుగా రాయితీలు ఉంటాయన్నారు. వీటిని ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)లకు మాత్రమే ఇవ్వాలన్నారు. ఒక్కో బృందంలో 300 మంది వరకు రైతులు ఉంటున్నందున ఏడాది పొడవునా వాటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తులను నిల్వచేసి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చన్నారు. జిల్లాలో 51 ఎఫ్‌పీవోలు ఉన్నాయన్నారు. పండ్లతోటల అభివృద్ధి, కూరగాయల సాగు తదితర పథకాలకు ఈ ఏడాది జిల్లాకు రూ.18.20 కోట్లు కేటాయించామని... మార్చిలోగా వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. గత రెండేళ్ల కాలంలో పెండింగ్‌లో ఉన్న రాయితీల చెల్లింపునకు నిధులు విడుదలయ్యాయన్నారు. సమావేశంలో ఏపీఎంఐపీ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రబాబు, ఉద్యానశాఖ అధికారి గోపీచంద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని