logo

గిరిజన విద్య మిథ్య

గిరిజన విద్య మిథ్యగా మారింది. గుణాత్మక విద్యను గిరిజన సంక్షేమ అధికారులు గాలికి వదిలేశారు. అడవి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి అధికారులు, పాలకుల్లో కొరవడింది.

Published : 04 Dec 2022 04:50 IST

పూర్తి స్థాయి ప్రధానోపాధ్యాయుడు లేని ఏటూరునాగారం ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల

గిరిజన విద్య మిథ్యగా మారింది. గుణాత్మక విద్యను గిరిజన సంక్షేమ అధికారులు గాలికి వదిలేశారు. అడవి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి అధికారులు, పాలకుల్లో కొరవడింది. భవనాలు, వసతులు ఉన్నా ఉపాధ్యాయులు, సిబ్బంది లేక విద్యార్థులు నష్టపోతున్నారు.

న్యూస్‌టుడే, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, వసతి గృహాలు, ప్రాథమికోన్నత నుంచి ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించిన పాఠశాలలు మొత్తం 77 ఉన్నాయి. వీటిల్లో 22,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయులను నియమించలేదు. ఆయా పాఠశాలల్లోని సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌కు ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా బాధ్యతలు అప్పగించారు. వారు తన పాఠ్యాంశాలు బోధించకుండా పాఠశాల నిర్వహణలోనే సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు వెనకబడిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని సగానికిపైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

సగానికి పైగా ఇన్‌ఛార్జి హెచ్‌ఎంలే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో సగానికి పైగా ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలనే కొనసాగుతోంది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ హెచ్‌ఎంగా పని చేసే కోడి రవీందర్‌ 2018 బదిలీల్లో ఇదే మండలంలోని కోమటిపల్లి బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఆ పాఠశాల సాంఘిక శాస్త్రం బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ శాంతకుమారి ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా కొనసాగుతున్నారు. తాడ్వాయి మండలం మేడారం బాలికల ఏహెచ్‌ఎస్‌లో పీజీహెచ్‌ఎం బదిలీ కాగా స్కూల్‌ అసిస్టెంట్‌ సరోజన ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనిపై పాలకులను, అధికారులను ప్రశ్నించే వారే కరవయ్యారు.

ఉన్నతీకరించి పోస్టుల మంజూరు మరిచారు

పలు ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు. సంబంధిత ఏహెచ్‌ఎస్‌లకు హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయడం మరిచిపోయారు. పలు వసతిగృహాలను ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా మర్చారు. వీటికి కూడా హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయలేదు. ఏటూరునాగారం బాలుర ఏయూపీఎస్‌ను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించి గెజిటెడ్‌ హెచ్‌ఎం పోస్టు మంజూరు చేయలేదు. భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల వసతిగృహాన్ని ఏహెచ్‌ఎస్‌గా ఉన్నతీకరించి హెచ్‌ఎం పోస్టును మంజూరు చేయకుండా ఏడో తరగతి వరకే కొనసాగిస్తున్నారు.


పదోన్నతులు లేక భర్తీకి ఇబ్బందులు
పోచం, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఏటూరునాగారం ఐటీడీఏ

ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేసిన కారణంగా పీజీహెచ్‌ఎంల కొరత ఏర్పడింది. పదోన్నతులు ఇచ్చినప్పుడే పోస్టుల భర్తీ చేయడం సాధ్యమవుతుంది. పోస్టులు మంజూరు కాని పాఠశాలలకు మంజూరు ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉంది. సంబంధిత పాఠశాలల్లో ఉన్న సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లతోనే హెచ్‌ఎం విధులు నిర్వర్తింపజేయాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని