logo

మెరుగైన సేవలే లక్ష్యం

ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గరకు చేసేందుకు సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆర్టీసీ డిపోలు పలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి.

Published : 29 May 2023 03:16 IST

హనుమకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ (పాత చిత్రం)

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గరకు చేసేందుకు సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆర్టీసీ డిపోలు పలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో బస్సు ప్రయాణ సమస్యలతో పాటు శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకోవాలంటే గ్రామీణులకు అవస్థలు తప్పడంలేదు. ఈ సమస్యను దూరం చేసి ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు అన్ని గ్రామాల్లో బస్‌ అధికారులను నియమించాలని సంస్థ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో 165 మందిని నియమించారు.


సేవలను వివరిస్తారు

గ్రామ బస్‌ అధికారులు ఆర్టీసీ ద్వారా అందించే సేవలను ప్రజలకు వివరిస్తారు. సురక్షిత ప్రయాణానికి బస్సులనే ఆశ్రయించాలని సూచిస్తారు. దివ్యాంగులు, విద్యార్థులకు రాయితీ పాస్‌లు ఇస్తున్న నేపథ్యంలో ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెబుతారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి ఆర్టీసీ అధికారులకు చేరవేస్తారు. శుభ కార్యాలయాలకు అద్దె బస్సుల బుకింగ్‌కు గతంలో డిపో వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇక మీదట విలేజ్‌ బస్‌ అధికారిని సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు, కల్యాణ మండపాల నిర్వాహకులకు తమ చరవాణి నంబరు అందించి ఆర్టీసీ కార్యక్రమాలను వారికి వివరిస్తారు.


ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారికి..

గ్రామాల్లో నివసించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు ఇతర ఉద్యోగులను గ్రామ బస్‌ అధికారులుగా నియమించారు. ప్రజలతో మంచి సంబంధాలుండి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి నియామకంలో ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద గ్రామాలకు ఒకరు, రెండు, మూడు చిన్న గ్రామాలకు ఒకరు చొప్పున, ఒకరికి 5 గ్రామాలు మించకుండా నియమించారు. నగరాల్లో వార్డుల వారీగా బస్సు అధికారులను నియమించారు.


అర్హులను నియమించాం

- శ్రీలత, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులైన వారిని గ్రామ బస్‌ అధికారులుగా నియమించాం. విధులపై పూర్తిస్థాయిలో వారికి సమాచారం ఇవ్వాలి. మరికొన్ని రోజుల్లో వీరు పూర్తి సేవలు అందిస్తారు. వారికి ఆర్టీసీ సంస్థ రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ అందిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రయాణికుల అవసరాలు ఎప్పటికప్పుడు గుర్తించి సేవలందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని