logo

సై అనాలన్నా... నై అనాలన్నా ఆయనే!

మదనపల్లె పురపాలక సంఘంలో గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

Published : 01 Jun 2023 04:42 IST

ఎమ్మెల్యే ఆధిపత్యంపై పుర ఛైర్‌పర్సన్‌ గుర్రు
మదనపల్లె వైకాపాలో భగ్గుమన్న విభేదాలు
పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం రద్దు
న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం

దనపల్లె పురపాలక సంఘంలో గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇక్కడ సాగుతున్న పరిపాలనను జీర్ణించుకోలేని కొందరు కౌన్సిలర్లు తమ ఆవేదనను కౌన్సిల్‌ సమావేశంలో ఛైర్‌పర్సన్‌ ఎదుట వెల్లగక్కారు. ఏకపక్ష నిర్ణయాలతో తమకు తీరని నష్టం జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి పనుల్లో, రాజకీయంగా గుర్తింపులోనూ తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక ఎత్తయితే మదనపల్లె పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ వి.మనూజ సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే అధికారం లేకుండాపోయింది. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలన్నా, అజెండా తయారు చేయాలన్నా తనకున్న అధికారాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ప్రారంభం నుంచి అదే పార్టీకి చెందిన నాయకులు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటిని ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీని దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోతూ వస్తున్నారు. పురపాలక సంఘంలో ఛైర్‌పర్సన్‌ సుప్రీం అయినప్పటికీ వీధి దీపం వేయించాలన్నా, కాలువ శుభ్రం చేయించాలన్నా, కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలన్నా, అజెండాను తయారు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఎమ్మెల్యే నవాజ్‌బాషాను సంప్రదించాల్సిందే. ఎమ్మెల్యే పరిశీలించిన తరువాత  ఆయన సూచన మేరకు ముందుకెళ్లాల్సిందే. కనీసం వార్డు కౌన్సిలర్‌ తన వార్డు సమస్యలను పురపాలక సంఘంలో ఫిర్యాదు చేసే పరిస్థితి లేకుండాపోయింది. దీనిపై పలుమార్లు పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఛైర్‌పర్సన్‌ మనూజ, ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఏడాదిపాటు ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో హోదాలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేవారు. ఆ సమయంలో సమావేశానికి వచ్చిన కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ప్రస్తావించలేకపోవడం గమనార్హం.

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తీవ్ర అసంతృప్తి

పురపాలక సంఘంలో జరుగుతున్న పరిణామాలపై ఛైర్‌పర్సన్‌ మనూజ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండాపోయిందని, తనను నమ్ముకున్న వారికి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని కొంతమంది కౌన్సిలర్ల ఎదుట ఆవేదన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పట్టణంలో మూడు చోట్ల భవన నిర్మాణ పనులకు ఛైర్‌పర్సన్‌ సిఫార్సు చేయడాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కమిషనర్‌ ద్వారా పనులను నిలిపివేయించినట్లు తెలిసింది. గత నెలలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడానికి అధికారులు యథావిధిగా అజెండాను తయారు చేసి ఛైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురాకుండా ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఛైర్‌పర్సన్‌ అజెండాపై సంతకం చేయలేదు. వ్యవహారం ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఫోన్‌లో ఆమెను సంప్రదించి సంతకం చేయాలని సూచించడంతో చేసేదిలేక ఆమె సంతకం చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సమావేశం నిర్వహించరాదని ఆదేశించడంతో రద్దయింది. పట్టణంలో ఏ కార్యక్రమం జరిగిన ఛైర్‌పర్సన్‌ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లేవారు. తాజాగా బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లెకు రాగా, ఛైర్‌పర్సన్‌ ప్రత్యేకంగా ఎంపీకి స్వాగతం పలికారు.

సమావేశం రద్దు కావడం వాస్తవమే

బుధవారం జరగాల్సిన కౌన్సిల్‌ సాధారణ సమావేశం రద్దయిన మాట వాస్తమేనని కమిషనర్‌ కె.ప్రమీల ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్రతిసారి అజెండాను ఎమ్మెల్యేకు చూపించి ఆయన సంతకాలు తీసుకున్న తరువాతే ఛైర్‌పర్సన్‌ వద్దకు తీసుకొచ్చి సంతకాలు తీసుకునేవాళ్లమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని