ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్‌ దీపాలు!

ఒక యుద్ధం వారికి నిలువ నీడ లేకుండా చేసింది.. దీంతో కట్టుబట్టలతో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో శరణార్థులుగా మారారు. ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆరు దశాబ్దాలు కావొస్తున్నా వారి గ్రామానికి విద్యుత్‌ సరఫరా లేదు. రాత్రి అయిందంటే కొవ్వొత్తి

Published : 03 Mar 2021 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక యుద్ధం వారికి నిలువ నీడ లేకుండా చేసింది.. దీంతో కట్టుబట్టలతో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో శరణార్థులుగా మారారు. ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆరు దశాబ్దాలు కావొస్తున్నా వారి గ్రామానికి విద్యుత్‌ సరఫరా లేదు. రాత్రి అయిందంటే కొవ్వొత్తి వెలుతురులో కాలం వెళ్లదీయాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న గ్రామానికి నలుగురు ఇంజినీర్లు వెలుగులు తీసుకొచ్చారు. ఆ విద్యుత్‌ కాంతులతో గ్రామ ప్రజల ముఖాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి.

లద్ధాఖ్‌లోని దుంగ్తి అనే గ్రామం భారత్‌, చైనా ఆధీనంలో ఉన్న భూభాగాన్ని వేరుచేసే వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంది. తొలి టిబెటన్‌ శరణార్థుల గ్రామంగా ఇది గుర్తింపు పొందింది. 1962లో చైనా.. భారత్‌ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిన తర్వాత టిబెట్‌కు చెందిన 30 కుటుంబాలు భారత్‌కు వచ్చి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ, మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం లేదు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఆరు దశాబ్దాలుగా ఈ గ్రామ ప్రజలు చీకట్లోనే బతికేస్తున్నారు.

గ్రామంలో వెలుగులు నింపిన ఆ నలుగురు

గ్లోబల్‌ హిమాలయన్‌ ఎక్స్‌పెడిషన్‌ అనే సంస్థ.. మారుమూల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 100కుపైగా గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించింది. ఈ సంస్థలో ఉద్యోగులు పలుమార్లు దుంగ్తి గ్రామం గుండా వేరే ప్రాంతాలకు వెళ్లారు. కానీ.. ఈ గ్రామంవైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇటీవల షఖీర్‌ హుస్సేన్‌.. మరో ముగ్గురు ఇంజినీర్లు ఈ గ్రామంపై సర్వే చేశారు. దేశంలో తొలి టిబెటన్‌ శరణార్థుల గ్రామంగా పేరొందిన ఈ గ్రామంలో విద్యుత్‌ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ గ్రామానికి సోలార్‌శక్తితో 8.6కిలోవాట్స్‌ సామర్థ్యం ఉన్న విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చారు. దీంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ఇంట్లో మూడు ఎల్‌ఈడీ దీపాలు, ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకునే సదుపాయం లభిస్తుంది. అలాగే పది సోలార్‌ ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చారు. గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామం ఏర్పడిన 60 ఏళ్లకు అక్కడి ప్రజలు తొలిసారి విద్యుత్‌ కాంతులను చూశారు.

ఇంజినీర్ల కోసం గ్రామస్థుల త్యాగం

గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి తమకు ఐదు రోజులు పట్టిందని ఇంజినీర్లు చెప్పుకొచ్చారు. లేహ్‌ నుంచి దుంగ్తికి చేరుకోవడానికి ఏడు గంటలు సమయం పట్టిందట. సరైన దారి లేకపోవడంతో గ్రామానికి చేరుకోవడానికి, ఆ ఎముకలు కొరికే చలిలో విద్యుత్‌ సరఫరా కోసం తీగలు అమర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. అయినా ప్రజలు తమకు ఎంతో మద్దతిచ్చారని పేర్కొన్నారు. ‘‘దుంగ్తి గ్రామంలో ఒక్కో కుటుంబం కేవలం రెండు చిన్నగదుల్లో నివసిస్తున్నాయి. దీంతో మాకు ఉండటానికి చోటే లేదు. అయినా, వారు ఒక ఇంటిని ఖాళీ చేసి మాకు ఇచ్చారు. శీతాకాలంలో అక్కడ -30డిగ్రీల వరకు చలి ఉంటుంది. ఆ చలిలో మేం ఉండలేకపోయాం. అందుకే ప్రజలు మా కోసం రాత్రుళ్లు చలిమంట వేసి.. అది ఆరిపోకుండా తెల్లవారేదాక చూసుకునేవారు’’అని ఇంజినీర్లు చెప్పారు. ఎట్టకేలకే గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం రావడంతో దుంగ్తి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని