CM Jagan: ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తి: స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్‌

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Updated : 15 Aug 2023 10:43 IST

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం జగన్‌ మాట్లాడారు. 

‘‘గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని.. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ సాహసాన్ని.. టంగూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని.. లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోంది. ఈ జెండాకు రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్‌ చేస్తున్నాం’’ అని సీఎం అన్నారు. 

Modi: త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం

50 నెలల తమ ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని జగన్‌ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని గొప్ప మార్పు ఇది అని వివరించారు. ‘‘ఆక్వా రైతులను రూ.1.50కే విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం మనదే. పాడి రైతులకు పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చాం. మూతబడిన చిత్తూరు డెయిరీతో పాటు సహకార సంఘాలకు జీవం పోశాం. భూవివాదాల ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తున్నాం. 1.54లక్షల ఎస్టీ రైతులకు 3.23లక్షల ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశాం. 

2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తి

ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. వంశధార ఫేజ్‌-2, వంశధార- నాగావళి అనుసంధానం పనులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తాం. వెలుగొండ మొదటి టన్నెల్‌ పూర్తిచేశాం.. రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయి’’ అని జగన్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని