AP News: పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ.. బలానికి డ్రైఫూట్స్‌, మటన్‌ కైమా

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గురు, డూ డూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు...

Published : 09 Jan 2022 01:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డూ డూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు... వీటన్నింటి మధ్యలో పోటాపోటీగా కోడి పందేలు. సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందేల జోరు అంతా ఇంతా కాదు. అయితే పండుగకు 5నెలల ముందు నుంచే కోడి పందేలకు సన్నద్ధమవుతుంటారు పందెం రాయుళ్లు. కోడి పందేలకు రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

కోడి పందేలకు కుక్కుట శాస్త్రం..
కోడి పందేల్లో  ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇక పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేస్తారు. ఆరోజు ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగున్న పుంజును మాత్రమే పందెంలోకి దించుతారని శిక్షకులు చెబుతున్నారు. 

బలానికి డ్రై ఫ్రూట్‌ లడ్డూ, మటన్‌ కైమా 
కోడి పుంజుకు బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫూట్‌ లడ్డూ, మన్‌ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యుడికి చూపించి వారి సలహా మేరకు విటమిన్‌ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరచూ ట్రయల్‌ పందేలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందేనికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10వేల నుంచి రూ.30వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 వరకు పుంజులను పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. 

పందెంకోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ..
ఏపీలోని పలు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలకు సిద్ధమవుతున్నారు. పందెం కోళ్లను ప్రతి రోజు ముగ్గురు సంరక్షించుకుంటారు. వీటికి మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే. పందేలపై ఏమేరకు శ్రద్ధ చూపుతారో అర్థం చేసుకోవచ్చు. ఉదయాన్నే 5గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లగాలి శ్వాస తీసుకునేలా చూట్టూ వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలిపెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్‌ చేయిస్తారు. పుంజులు బాగా అలసిపోయిన తర్వాత పాలల్లో నానబెట్టిన పిస్తా, ఖర్జూరా, కిస్‌మిస్‌లు పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. కోడి పుంజులు పందేలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా శిక్షణఇస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తారని కోడిపందేలకు శిక్షణ ఇచ్చేవారు చెబుతున్నారు. 

కోడి పుంజుల్లో రకాలు..

పందేలకు రెడీ చేసే కోడి పుంజుల్లో కూడా చాలా రకాలుంటాయి. వాటిలో గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. వీటిలో తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులు ఎంతటి పందెంనైనా నెగ్గే శక్తి ఉంటుంది. ఒక్కో పుంజు ఖర్చు రూ.80వేల నుంచి  రూ.లక్ష వరకు ఉంటుంది. పందెంలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందెంలలో తట్టుకునే విధంగా  శిక్షణ ఇస్తారు. పూర్తి స్థాయిలో కోడి పుంజులు పందేలకు సిద్ధమైన తర్వాత ఒక్కో పుంజు ధర రూ.లక్షల్లో  ఉంటుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగకు నెల రోజుల ముందు నుంచే పుంజులకు గిరాకీ ఉంటుందని చెబుతున్నారు.

పందేల్లో విజయం కోసం ముహూర్తాలు..
కోడి పందేల్లో నెగ్గేందుకు ముహూర్తాలు కూడా చూస్తుంటారు. ఏ కోడి ఏ రోజు పందెంలో పాల్గొంటే విజయం సాధిస్తుందో.. ఆ కోడిని పందెంలోకి దింపుతారట. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలికి చెందిన పుంజులు పందేల్లో విజయం సాధిస్తాయట. 14న కాకి నెమలి, పసి మగల్ల కాకి పుంజులు, కాకిడేగలకు చెందిన పుంజులు గెలుపొందుతాయని, అలాగే 15న డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో విజయం సాధిస్తాయని కోడిపందేల్లో ప్రావీణ్యం ఉన్నవారు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని