ఓంప్రతాప్‌ మృతిపై ప్రత్యేక విచారణ

మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓంప్రతాప్‌ (30) మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ..

Published : 28 Aug 2020 13:44 IST

చిత్తూరు: మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓంప్రతాప్‌ (30) మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ప్రత్యేక అధికారి, సోమల తహశీల్దార్ శ్యాం సుందర్‌రెడ్డి‌, ఓంప్రతాప్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు ఉదయం బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఈ నెల 24న ఖననం చేసిన ప్రాంతంలోనే వైద్యులు శవపరీక్ష పూర్తి చేశారు.

ఏం జరిగిందంటే?
సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదెమ్మల పెద్దకుమారుడు ఓంప్రతాప్‌ మదనపల్లెలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బసినికొండ సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి మద్యం కొన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తిని వీడియో తీయమన్నాడు. అందులో రూ.140లుగా ఉన్న బీరు బాటిల్‌ను రూ.240కు పెంచారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈనెల 24న స్వగ్రామంలో పొలం పనులకు వచ్చి మృతి చెందాడు. మరో వైపు ఓంప్రతాంప్‌ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు బయల్దేరని చిత్తూరు జిల్లా తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని