ఈ ఆలయాల సంపద అంతా ఇంతా కాదు!

భారతదేశంలో వేలసంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించేందుకు నిత్యం ఆ ఆలయాలకు వెళ్తుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి.. తమకు తోచిన విధంగా కానుకలు చెల్లిస్తారు. ఇలా కానుకల రూపంలో వచ్చిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు దేవాలయానికి ఆదాయంగా

Updated : 27 Jun 2021 16:19 IST

భారతదేశంలో వేలసంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించేందుకు నిత్యం ఆ ఆలయాలకు వెళ్తుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి.. తమకు తోచిన విధంగా కానుకలు చెల్లిస్తారు. ఇలా కానుకల రూపంలో వచ్చిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు దేవాలయానికి ఆదాయంగా మారుతుంది. ఈ క్రమంలో కొన్ని దేవాలయాల సంపన్న దేవాలయాలుగా అవతరించాయి. మరి దేవాలయాలేవి? వాటి సంపద ఎంతో తెలుసుకుందామా..?

అనంత పద్మనాభస్వామి దేవాలయం - తిరువనంతపురం

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరుగాంచింది. ఒకప్పుడు ఈ ఆలయం తిరువనంతపురం ట్రావెన్‌కోర్‌ రాజులు ఏలుబడిలో వుండేది. కొంతకాలం కిందట ఆ ఆలయంలో ఉన్న నేలమాళిగల్లో నిధి ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని గదులను తెరవగా.. రూ. వేలకోట్లు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. మరొక గదికి నాగబంధనం ఉండటంతో పండితులు తెరవకూడదన్నారు. అందులో అనంత సంపద ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సంపద విలువ కనీసం రూ.1.63లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 


 

వేంకటేశ్వరస్వామి ఆలయం - తిరుమల

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల శ్రీనివాసుని ఆలయం దేశంలోనే ఎక్కువ మంది భక్తుల తాకిడి ఉన్న దేవాలయం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం నిత్యం సగటున 70వేల మంది వస్తుంటారు. కలియుగ దైవంగా కొలిచే శ్రీవారికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా భక్తుల సంఖ్య, ఆదాయం తగ్గింది కానీ.. సాధారణంగా ఏటా రూ.650కోట్లు భక్తుల కానుకల రూపంలో వస్తాయి. ఈ దేవాలయ నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) చూసుకుంటుంది. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 


 

వైష్ణో దేవి - జమ్ముకశ్మీర్‌

శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన దేవాలయం వైష్ణోదేవి ఆలయం. జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి దేశవిదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఏటా వైష్ణోదేవీ ఆలయానికి రూ. 500కోట్లు భక్తుల కానుకల రూపంలో వస్తాయట.  


సాయి బాబా దేవాలయం - షిర్డీ

అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా ఆలయం ఒకటి. హిందువులతోపాటు పలు మతాలకు చెందిన వారు కూడా సాయి బాబాను దర్శించుకుంటుంటారు. షిర్డీ సాయి సంస్థాన్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ దేవాలయానికి ఏటా రూ.450కోట్లు ఆదాయం వస్తోంది. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 


సిద్ధి వినాయక ఆలయం - ముంబయి

ముంబయిలో అనేక దేవాలయాలు ఉన్నా.. ఎస్‌కే బోలె మార్గ్‌లో ఉన్న సిద్ధి వినాయక ఆలయం చాలా ఫేమస్‌. ఈ ఆలయంలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులందరూ వెళ్తుంటారు. వినాయకుడికి ప్రముఖులు భారీగానే కానుకలు సమర్పించుకుంటుంటారు. అందుకే అతి సాధారణంగా కనిపించే ఈ ఆలయానికి ఏటా రూ.125కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

ఇవేకాకుండా తమిళనాడులోని మీనాక్షి అమ్మన్‌, ఒడిశాలోని పూరీ జగన్నాథ్‌, గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయాలకు కూడా రూ.కోట్లలో ఆదాయం ఉంటుందట. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని