Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 17 May 2023 21:02 IST

1. కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం: సీఎం కేసీఆర్‌

రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భారాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  భారాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తుది తీర్పునకు లోబడే ఆర్‌-5జోన్‌లో పట్టాల పంపిణీ: సుప్రీంకోర్టు

అమరావతి ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌-5జోన్‌లో పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చి చెప్పింది. పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండబోదని ఉద్ఘాటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరిన్ని హంగులతో వందేభారత్.. తగ్గిన ప్రయాణ సమయం

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 16 బోగీలతో మొదటి ట్రిప్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి 109శాతం ప్రయాణికులతో బయలుదేరినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో రైలు గమ్యస్థానానికి చేరుకున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన నాటి నుంచి ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శ్రీవారి ఆర్జిత సేవలు.. దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

కలియుుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్‌ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రేపటి నుంచే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పదోన్నతులు, బదిలీల గురించి భేటీలో చర్చించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపట్టనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రేమ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రేమ వివాహాల(Love Marriages)పై బుధవారం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. చాలామటుకు విడాకులు ఈ తరహా వివాహాల్లోనే కనిపిస్తున్నాయని పేర్కొంది. ఓ జంట మధ్య మనస్పర్థలకు సంబంధించిన పిటిషన్ బదిలీపై విచారిస్తోన్న సందర్భంలో కోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ కేసులో వాదనలను వినిపించిన న్యాయవాది ఆ జంటది ప్రేమ వివాహం అని కోర్టుకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘భగవద్గీత’ తెచ్చిన మార్పు.. 9ఏళ్ల క్రితం చోరీ చేసిన ఆభరణాల్ని ఇచ్చేసిన దొంగ!

ఒడిశాలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్ర గ్రంథం భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఓ ఆలయంలో చోరీ చేసిన విలువైన నగల్ని అతడు తిరిగి ఇచ్చేశాడు. అంతేకాకుండా  తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ ఆలయ పూజారికి లేఖ రాసి అక్కడ వదిలి వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బిడ్డ కావాలి.. నా భర్తకు పెరోల్‌ ఇవ్వండి: ఓ మహిళ అభ్యర్థన

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలు అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైల్లో ఉన్న తన భర్తను పెరోల్‌ (Parole)పై విడుదల చేయాలని ఆ మహిళ దరఖాస్తు చేసుకుంది. గ్వాలియర్‌లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్‌ జాతవ్‌ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బర్గర్‌ స్థానంలో పానీపూరీ వస్తుందా..? ప్రవాసుల ప్రశ్నకు జైశంకర్‌ సమాధానమిదే..!

భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) గత ఇటీవల స్వీడన్‌ (Sweden )లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన ప్రవాస భారతీయుల (Indian diaspora)తో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి ప్రపంచీకరణ (globalisation of the Indian culture) గురించి ప్రవాసులు అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అదే తప్పు.. మళ్లీ మళ్లీ చేసి ఓడారు: ముంబయి బౌలింగ్‌ కోచ్‌ అసహనం

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) బౌలర్లు డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. దీంతో ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లఖ్‌నవూ 17 ఓవర్లకు 123/3 స్కోరుతో ఉండగా.. చివరి మూడు ఓవర్లలో ఏకంగా 54 పరుగులను రాబట్టింది. ముంబయి బౌలర్‌ క్రిస్‌ జొర్డాన్‌ ఒకే ఓవర్‌లో 24 పరుగులు ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని