దిల్లీ పేలుడు.. ఆ ఉగ్రవాదుల పనేనా?

దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన ఉగ్రదాడిగా తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ జైష్‌-ఉల్‌-హింద్‌ సోషల్‌మీడియాలో

Published : 30 Jan 2021 14:50 IST

తామే చేశామంటూ జైష్‌-ఉల్‌-హింద్‌ సంస్థ ప్రకటన!

దిల్లీ: దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన ఉగ్రదాడిగా తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ జైష్‌-ఉల్‌-హింద్‌ సోషల్‌మీడియాలో ప్రకటించుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జైష్‌కు చెందిన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

ఎన్‌ఐఏ కీలక సమావేశం

మరోవైపు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దిల్లీ ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కేంద్ర కార్యాలయంలో అధికారులు నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఘటనపై విస్తృతంగా చర్చించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల క్రియాశీల సభ్యుల సమాచారం సేకరణకు ఎన్‌ఐఏ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, స్లీపర్‌ సెల్స్‌ వివరాలు సేకరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ఐఏ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని ప్రభుత్వం తెలిపింది. హిజ్బుల్‌ వంటి ఉగ్రవాద సంస్థలేవీ ఇంకా ప్రకటనలు చేయలేదని పేర్కొంది. ప్రస్తుత సమాచారంతో ఇరాన్‌పై అధికారికంగా ఆరోపణలు చేయలేమని తెలిపింది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చాక కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

దేశ రాజధాని నడిబొడ్డులో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ఘటనాస్థలానికి 1.5కిలోమీటర్ల దూరంలోని విజయ్‌ చౌక్‌లో గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమం జరిగింది. అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. అలాంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో పేలుడు సంభవించడంతో దేశం ఉలిక్కిపడింది. మరోవైపు ఘటనాస్థలానికి కొంత దూరంలో ఓ లేఖను గుర్తించినట్లు సమాచారం. అందులో ‘‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే’’ అని కూడా రాసి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

దిల్లీ పేలుడు: సీసీటీవీ ఫుటేజీలో అనుమానితులు

దేశ రాజధానిలో బాంబు పేలుడు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని