బైడెన్‌ గెలుపు..ఊపిరిపీల్చుకున్న చైనా..!

అమెరికా ఎన్నికల ఫలితాలపై చైనా అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, అక్కడి అధికారిక మీడియా మాత్రం ట్రంప్‌ శకం ముగిసిందని పేర్కొన్నాయి.

Published : 08 Nov 2020 15:06 IST

ట్రంప్‌ శకం ముగిసిందన్ని చైనా మీడియా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి గెలుపొందడంతో ప్రపంచ దేశాలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాయి. కానీ, చైనా మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అక్కడి అధికారిక మీడియా మాత్రం ట్రంప్‌ శకం ముగిసిందని పేర్కొంది.  అంతేకాకుండా అమెరికా-చైనా దేశాల మధ్య క్షీణిస్తోన్న సంబంధాలను బైడెన్‌ తటస్థీకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేసింది. వీటిని చూస్తే.. బైడెన్‌ గెలుపుతో చైనా ఊపిరి పీల్చుకున్నట్లే కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరికొంత కాలంపాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి.

బైడెన్‌ గెలుపు ప్రకటన రాగానే.. ‘ట్రంప్‌ శకం ముగిసింది’ అని చైనా మీడియా పేర్కొంది. బైడెన్‌ గెలుపుపై ప్రపంచ నాయకులు అభినందించిన తీరును ఉదహరించిన చైనా, ట్రంప్‌ ఓటమితో కొన్నిదేశాలకు ఉపశమనం కలిగిందంది. ముఖ్యంగా ‘అమెరికా-చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా అధ్యక్షుడి ఎన్నికతో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు చైనా అభిప్రాయపడింది. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు తిరిగి ప్రారంభమవడం, పరస్పర వ్యూహాత్మక నమ్మకాన్ని పునర్నిర్మించడంలో పురోగతికి ఈ నూతన అధ్యక్షుడి ఎన్నిక అవకాశం కల్పిస్తుంది’ అని చైనా గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో వెల్లడించింది. వీటితోపాటు పర్యావరణ మార్పు, కరోనా వైరస్‌ కట్టడి, వ్యాక్సిన్‌ అభివృద్ధి వంటి విషయాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తంచేసిన చైనా మీడియా.., విదేశీ వ్యవహారాల్లో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ అత్యంత పరిణితి కనబరుస్తారని అభిప్రాయపడింది.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. వాణిజ్య యుద్ధం మొదలుకొని, కరోనా వైరస్‌ విషయాలపై చైనాపై ట్రంప్‌ దూకుడుగానే వ్యవహరించారు. ఈ చర్యలను గతకొద్ది రోజులుగా చైనా నియంత్రణలో ఉన్న అక్కడి మీడియా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇక అమెరికా ఎన్నికలపై ముందునుంచి మౌనంగా ఉంటూ, వేచిచూసే ధోరణిలో ఉన్న చైనా, తాజాగా బైడెన్‌ గెలుపు అనంతరం ఊపిరిపీల్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇవీ చదవండి..
ట్రంప్‌ తప్పటడుగులు ఇవేనా..?
బైడెన్‌-భారత్‌కేంటీ..?



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని