వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం.....

Updated : 27 Sep 2020 19:11 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి.

రైతు శ్రేయం కోసమంటూ జూన్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు 2020, ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్లు 2020, ద ఎసన్షియల్‌ కమోడిటీస్‌ (సవరణ) బిల్లు 2020 పేరిట తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులు లోక్‌సభలో సులువుగా ఆమోదం పొందాయి. పెద్దల సభలో ఎన్డీయేకు బలం లేనప్పటికీ విపక్షాల ఆందోళనలు, వాకౌట్‌ల నడుమ రాజ్యసభలోనూ వీటికి ఆమోదముద్ర పడింది. 

మొదటి బిల్లు రైతులు తమ పంటల్ని ఎక్కడైనా విక్రయించుకోవచ్చని కేంద్రం చెబుతోంది. వ్యాపారులతో చేసుకునే ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడం; నిత్యావసరాలైన చిరు, పప్పు ధాన్యాలు, నూనెగింజల నిల్వలపై ఆంక్షలు తొలగించడం మిగిలిన రెండు బిల్లుల ఉద్దేశం. వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు ఈ బిల్లులు దోహదం చేస్తాయని కేంద్రం చెబుతోంది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు, కనీస మద్దతు ధర నుంచి వైదొలిగేందుకు కేంద్రం వీటిని తీసుకొచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీటిపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరాయి. మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్‌ కూటమి నుంచి వైదొలిగింది. ఆ పార్టీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లులపై ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని