Ajit Doval: బ్రిక్స్లో చైనాకు చురకలేసిన అజిత్ డోభాల్..!
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో జరుగుతన్న బ్రిక్స్ సమావేశంలో ఆయన చైనాకు చురకలు వేశారు.
ఇంటర్నెట్డెస్క్: ఐరాస ఉగ్ర జాబితాలోని సంస్థలపై బ్రిక్స్ (BRICS) దేశాలు కలిసి పనిచేయాలని.. ఈ క్రమంలో ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయాలకు దూరంగా వ్యవహరించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాపై సభ్య దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. ‘‘శిక్షల నుంచి తప్పించుకొంటూ అఫ్గాన్-పాక్ ప్రాంతంలో ఉగ్ర సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై చర్చ జరుగుతున్న సమయంలో బ్రిక్స్ ఎన్ఎస్ఏల సమావేశం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. సమష్టి లక్ష్యాల సాధనకు, సమష్టి సమస్యల పరిష్కారానికి బ్రిక్స్ వేదికను ఉపయోగించుకోవాలని డోభాల్ సూచించారు.
‘అవిశ్వాసాన్ని’ ఆనాడే ఊహించిన మోదీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్
నీటి భద్రత ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారిందని అజిత్ డోభాల్ అభిప్రాయపడ్డారు. సీమాంతర జలవనరుల వినియోగం విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని.. నీటిని ఆయుధంలా వినియోగించకూడదన్నారు. సీమాంతర జలాలకు సంబంధించిన వివరాలను పొరుగు దేశాలతో పంచుకోవాలన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవడాన్ని నివారించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆహార సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు. కరోనా సమయంలో చాలా దేశాలకు ఆహారం అందించిందని గుర్తుచేశారు. నిరంతర ఆహార సరఫరా జరగాలంటే ఎరువుల కొరత ఉండకూడదన్నారు. నేటి ఎరువుల కరవే రేపటి ఆహార కొరతకు మూలం కానుందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.