ED: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. రూ.751 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో రూ.751.90కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Updated : 21 Nov 2023 21:02 IST

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో రూ.751.90కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తోపాటు దాన్ని నిర్వహిస్తోన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. దీంతోపాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్‌ ఇండియన్‌ రూ.90.21కోట్లు కలిగి ఉందని తెలిపింది. మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌లను ఇదివరకే విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌..ఇదీ అసలు వివాదం!

ఇదిలాఉంటే, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ప్రచురణకర్తగా ఉంది. సోనియా, రాహుల్‌ సహా కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దానికి యాజమాన్య సంస్థ. యంగ్‌ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్‌ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని