మణిపుర్‌లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు

మణిపుర్‌లోని బిష్ణుపుర్‌ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 01 May 2024 05:01 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లోని బిష్ణుపుర్‌ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున కుంబి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది రెండు ఎస్‌యూవీలను అడ్డుకున్నారు. దీంతో వాహనాల్లోని ఆయుధాలను వదిలేసి, వాటిలోని సిబ్బంది పరారైనట్లు వివరించారు. కాసేపటి తర్వాత మైతేయ్‌ తెగకు చెందిన వందలాది మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఆ ఆయుధ సామగ్రి తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. గత ఏడాది మేలో మొదలైన అల్లర్లు ముగిసేవరకు ఎలాంటి ఆయుధాలు జప్తు చేయొద్దన్నారు. ఈ క్రమంలో రోడ్డును దిగ్బంధించి ఆర్మీ కాన్వాయ్‌ను కదలనీయకుండా అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ఆయుధాలను పోలీసులకు అప్పగిస్తామని సైనిక సిబ్బంది చెప్పడంతో మహిళలు శాంతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని