అనిల్‌ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు

ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

Updated : 26 Jun 2021 12:26 IST

వ్యక్తిగత సిబ్బంది, కార్యదర్శి అరెస్టు.. ఈడీ సమన్లు

దిల్లీ: ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శిని అరెస్టు చేశారు. తాజాగా ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యాయి. మనీలాండరింగ్‌ కేసులో శనివారం ఉదయం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది.

బార్‌ యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ పోలీసులకు లక్ష్యంగా పెట్టారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఏప్రిల్‌లో ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ్‌ముఖ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పరమ్‌బీర్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఇటీవల బాంబే హైకోర్టు... సీబీఐని ఆదేశించింది. దీంతో మాజీ మంత్రిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ.. దేశ్‌ముఖ్‌పై అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి తాజాగా సోదాలు నిర్వహించింది. ఇందులో ముంబయిలోని ఇంటితో పాటు.. నాగ్‌పుర్‌లోని దేశ్‌ముఖ్‌ నివాసం కూడా ఉంది.

దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత కార్యదర్శి సంజయ్‌ పలాండే, వ్యక్తిగత సిబ్బంది కుందన్‌ షిండేను తమ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ.. అనంతరం వారిద్దరిని అరెస్టు చేయడం గమనార్హం. కస్టోడియల్‌ విచారణ కోసం నేడు వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో దేశ్‌ముఖ్‌కు రూ.4 కోట్లు ఇచ్చామని కొందరు బార్‌ యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరి వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం.

అసహనంతోనే వేధింపులు: పవార్‌

తమ పార్టీ సీనియర్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కావాలనే విచారణ సంస్థలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశ్‌ముఖ్‌ కొడుకు వ్యాపారాలపై ఆరా తీశారు. ఏమీ దొరకలేదు. ఆ అసహనంతో అనిల్‌ను వేధిస్తున్నారు. ఇవి మా పార్టీకి కొత్త కాదు. వాటి గురించి ఆందోళన చెందం’’ అని పవార్‌ తెలిపారు. మరోవైపు విచారణాధికారులకు పూర్తిగా సహకరిస్తానని దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఈడీ దాడులు రాజకీయప్రేరేపితమని, తమ పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలను భాజపా ఖండించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని