ఆ టికెట్లన్నీ రద్దు: రైల్వేశాఖ

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రకటించిన లాక్‌డౌన్‌ మే 17వ తేదీ

Updated : 14 May 2020 14:22 IST

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రకటించిన లాక్‌డౌన్‌ మే 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 30వ తేదీ వరకూ బుక్‌ చేసుకున్న అన్ని రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జూన్‌ 30వ తేదీలోగా ప్రయాణించడానికి వీలుగా మార్చి 25వ తేదీ కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లన్నీ రద్దు అవుతాయని తెలిపింది. టికెట్ల సొమ్ము తిరిగి ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించింది.

అయితే, వలస కూలీలను సొంతు ఊళ్లకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు కావు. అదే విధంగా ఇటీవల ప్రారంభించిన 15 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్లకు ఇది వర్తించదు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్‌ చేసుకునే ప్రతి ప్రయాణికుడి గమ్య స్థానాల చిరునామాను కూడా సేకరిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఎక్కడ ఉంటారో సులభంగా గుర్తించవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లో మార్పులు చేశారు.

లాక్‌డౌన్‌ 4.0 మరిన్ని సడలింపులు ఉంటాయా?

ప్రస్తుతం విధించిన మూడో లాకౌడౌన్‌ మే 17వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ 4.0 గురించి ప్రధాని నరేంద్రమోదీ సూచన ప్రాయంగా చెప్పారు. కొన్ని నిబంధనలతో దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన విధి విధానాలను మే 18వ తేదీ కన్నా ముందే వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే 15 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. బస్సులు నడిపే విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మేరకు బస్సు సీటింగ్‌లో మార్పులు చేస్తున్నారు. 14రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు ఇష్టపడేవారు హైదరాబాద్‌ నుంచి ఏపీకి రావొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి ప్రజా రవాణాకు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

రైలు టికెట్ల రద్దు.. ఇవి మీకు తెలుసా?

* రైల్వే టికెట్ల రద్దు నిర్ణయం శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు, 15 ప్రత్యేక రైళ్లకు వర్తించదు.

* ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక రైళ్లకు ఇది వర్తించకుండా మార్పులు చేశారు.

* మే 13వ తేదీ నుంచి రైలు టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ గమ్య స్థానాలకు సంబంధించిన చిరునామా తప్పకుండా ఇవ్వాలి. దీని వల్ల ఆ ప్రయాణికులను గుర్తించడం సులభం అవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో ఇది ఉపయోగపడుతుంది.

* మే 13వ తేదీ నుంచి ఐఆర్‌సీటీసీలో ఈ మేరకు మార్పులు చేశారు.

* కరోనా లక్షణాలతో బాధపడేవారిని ప్రయాణానికి అనుమతించరు. అలాంటి ప్రయాణికులకు టికెట్‌ డబ్బులు మొత్తం చెల్లిస్తారు.

* ఒక పీఎన్‌ఆర్‌ మీద బృందంగా ప్రయాణించే వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ మొత్తం బృందం టికెట్లు రద్దవుతాయి. ఆ టికెట్ల మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని