దిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌

ఆరోగ్యం విషమించిన కరోనా పాజిటివ్‌ బాధితుల్లో ప్లాస్మా థెరపీ చికిత్స మెరుగైన ఫలితాలిస్తున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కోరల్లోంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి నుంచి ప్లాస్మాను........

Published : 30 Jun 2020 01:12 IST

 ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: ఆరోగ్యం విషమించిన కరోనా పాజిటివ్‌ బాధితుల్లో ప్లాస్మా థెరపీ చికిత్స మెరుగైన ఫలితాలిస్తున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కోరల్లోంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి నుంచి ప్లాస్మాను సేకరించేందుకు ‘ప్లాస్మా బ్యాంక్‌’ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వచ్చే రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు స్వచ్ఛందంగా ప్లాస్మా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు దిల్లీలో 29 మందికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. వారందరిలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. 

ఈ సందర్భంగా కరోనాతో పోరాడుతూ ప్రాణాలొదిలిన లోక్‌నాయక్‌ జయ్‌ప్రకాశ్‌ నారాయణ్‌‌ ఆసుపత్రి వైద్యుడు అసీం గుప్తా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. 

కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని ప్లాస్మా థెరపీలో సేకరిస్తారు. అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు. కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్‌పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఇటువంటి వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధిచెంది వైరస్‌పై పోరాడటంలో దోహదపడతాయి. దీంతో అతడు ఈ వైరస్‌ బారినుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. సానుకూల ఫలితాలు ఉండడంతో ఈ చికిత్సను విస్తృతపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి..
24గంట‌ల్లో 19,459 కేసులు, 380 మ‌ర‌ణాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని