గణతంత్ర వేడుకల వేళ.. నిఘా నీడలో దిల్లీ

గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం కావడంతో దేశ రాజధాని నగరమైన దిల్లీ ఇప్పటికే నిఘా నీడలోకి వెళ్లగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Updated : 26 Jan 2023 06:04 IST

6,000 మందితో భద్రత
సందర్శకులకు క్యూఆర్‌ కోడ్‌

దిల్లీ: గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం కావడంతో దేశ రాజధాని నగరమైన దిల్లీ ఇప్పటికే నిఘా నీడలోకి వెళ్లగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు. 6,000 మంది భద్రతా సిబ్బంది, 24 హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం చేశారు. 60 వేల మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు తరలివస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సందర్శకుల పాసులకు క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. 150కు పైగా సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఎన్‌ఎస్జీ, డీఆర్డీవోలకు చెందిన యాంటీ డ్రోన్‌ బృందాలను నియమించారు. 

*  రిపబ్లిక్‌ డే సందర్భంగా కర్తవ్యపథ్‌లో నిర్వహించే ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు ప్రపంచానికి తమ సత్తాను చాటి చెప్పనున్నాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్‌’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం పదిన్నరకు విజయ్‌చౌక్‌ వద్ద కవాతు మొదలై ఎర్రకోట వరకు సాగుతుంది. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం కవాతులో పాల్గొంటాయి. సంప్రదాయ 21 గన్‌ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్‌ పౌండర్‌ గన్స్‌ను 105 ఎం.ఎం. ఇండియన్‌ ఫీల్డ్‌ గన్స్‌తో భర్తీ చేయనున్నారు. ఈజిప్ట్‌ నుంచి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక పటాలం కూడా ఈ కవాతులో పాల్గొననుంది. భారత సైన్యంలో కొత్తగా చేరిన అగ్నివీరులు భాగస్వాములు కానున్నారు. ఆర్మీ సిగ్నల్‌ కోర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌, ఆర్మీ డేర్‌ డెవిల్స్‌ విభాగాల నుంచి మహిళా అధికారులు.. తొలిసారిగా బీఎస్‌ఎఫ్‌ ఒంటెల దళం మహిళా సభ్యులు మార్చ్‌లో పాల్గొంటారు. ఆకాశ్‌ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్‌ చేతన్‌శర్మ నేతృత్వం వహిస్తారు. 

*  నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్‌ బృందానికి మహిళా అధికారులు నేతృత్వం వహిస్తారు. ఈ కవాతు కోసం నేవీకి చెందిన ఐఎల్‌ - 38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందిస్తోంది. రిపబ్లిక్‌ డే ఫ్లైపాస్ట్‌ విన్యాసంలో మొత్తం 44 విమానాలు పాల్గొంటాయి. వీటిలో తొమ్మిది రఫేల్‌ జెట్‌ విమానాలు. దేశీయంగా తయారుచేసిన తేలికపాటి అటాక్‌ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వేడుకల్లో మొత్తం 16 మార్చింగ్‌ దళాలు పాల్గొంటాయి. వీటిలో 8 త్రివిధ దళాలకు చెందినవి. మిగతా పారామిలీటరీ బలగాలు, దిల్లీ పోలీస్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లకు చెందినవి. కవాతులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాలకు చెందిన 27 శకటాల ప్రదర్శన ఉంటుంది. వందేభారతం కార్యక్రమంలో ఎంపికైన 475 మంది కళాకారులు తమ కళారూపాలు ప్రదర్శిస్తారు. బాల పురస్కార్‌ పొందిన 25 మంది చిన్నారులు కవాతులో పాల్గొంటారు. అదేవిధంగా మురికివాడల నుంచి ఎంపిక చేసిన 11-18 ఏళ్ల వయసున్న 40 మంది పిల్లలను సైతం ఇందులో భాగస్వాములుగా చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని