కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలుపనున్న కేంద్రం!

ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించేందుకు చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి.

Published : 03 Feb 2023 05:24 IST

సుప్రీం జడ్జీలుగా అయిదుగురి పేర్లకు లైన్‌క్లియర్‌!

దిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించేందుకు చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి. గతేడాది డిసెంబర్‌ 13న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ఈ సిఫార్సులు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల పేర్లతో జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ అయిదుగురి నియామకాలు కార్యరూపం దాల్చితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరుగుతుంది. సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది జడ్జీల నియామక సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 27 మందే  ఉన్నారు. జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం మరో రెండు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. అలహాబాద్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల పేర్లను దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పదోన్నతులకు సిఫార్సు చేశారు. ఈ రెండు పేర్లను సిఫార్సు చేసే సందర్భంగా అంతకుముందు అయిదుగురి పేర్లతో తాము చేసిన సిఫార్సులకు ప్రాధాన్యం ఉన్నట్లు సుప్రీంకోర్టు  కొలీజియం కేంద్రం దృష్టికి తెచ్చింది. 

విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోరా: సుప్రీం

దిల్లీ: విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో తాము స్పష్టంగా గతంలో ఉత్తర్వులు ఇచ్చినా.. పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఈ ప్రసంగాలపై పదే పదే మార్గదర్శకాలు జారీ చేయాల్సి రావడం న్యాయస్థానానికి ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది. ఈ ఘాటు వ్యాఖ్యలను.. ఈ నెల 5న ‘హిందూ జన్‌ ఆక్రోశ్‌ మోర్చా’ ముంబయిలో నిర్వహించనున్న ర్యాలీపై నిషేధం విధించమంటూ దాఖలైన ఓ అత్యవసర పిటిషన్‌ స్వీకరణ సందర్భంగా గురువారం చేసింది.

వీఆర్‌ఎస్‌ ఉద్యోగులను.. వారితో సమానంగా చూడలేం

దిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పొందిన ఉద్యోగులను పూర్తికాలం పాటు పనిచేసి రిటైరయినవారితో సమానంగా చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎంఎస్‌ఎఫ్‌సీ)లో వీఆర్‌ఎస్‌ తీసుకున్న కొందరు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌ల ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్య చేసింది. వేతన స్కేలు సవరణతో కలిగే ప్రయోజనాలను తమకు వర్తింపజేసేందుకు నిరాకరిస్తూ బాంబే హైకోర్టు తీర్పునివ్వడాన్ని సవాలు చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి అపీలుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పదవీ విరమణ వయసు వచ్చేదాకా పనిచేసినవారితో తమను సమానంగా చూడాలని వీఆర్‌ఎస్‌ ఉద్యోగులు కోరడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

నెల రోజుల్లోగా బాండ్‌ సమర్పించలేకపోతే.. బెయిలు షరతులను సవరించండి

దిల్లీ: విచారణలో ఉన్న ఖైదీల్లో చాలామంది బెయిలు మంజూరైనప్పటికీ జైలు నుంచి విడుదల కావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిలు షరతులకు అనుగుణంగా బాండ్‌ సమర్పించలేకపోవడం అందుకు ఓ ప్రధాన కారణమని తెలిపింది. ఈ నేపథ్యంలో- నెల రోజుల్లోగా బాండ్లను సమర్పించలేకపోయిన ఖైదీల కోసం బెయిలు షరతులను సవరించే అవకాశాలను పరిశీలించాలని దిగువ కోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకల ధర్మాసనం తాజాగా ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక పూచీకత్తు (లోకల్‌ ష్యూరిటీ) సమర్పించలేనివారిని.. దానికోసం ఒత్తిడి చేయొద్దని సూచించింది. విడుదలయ్యాక పూచీకత్తు సమర్పిస్తామంటూ ఖైదీలెవరైనా విన్నవిస్తే.. ఆయా కేసులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బాండు/ష్యూరిటీ సమర్పించేందుకు వీలుగా నిర్దిష్ట కాలం పాటు వారికి తాత్కాలిక బెయిలు మంజూరు చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని