కర్బన ఉద్గారాల పరిహారం 170 లక్షల కోట్ల డాలర్లు.. నిజంగా చెల్లిస్తే ప్రతి భారతీయుడికి 1,446 డాలర్లు

భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్‌ జీరో)ను అందుకోవలసి ఉంటుంది.

Updated : 07 Jun 2023 05:33 IST

దిల్లీ: భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్‌ జీరో)ను అందుకోవలసి ఉంటుంది. 2015 పారిస్‌ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తామని ప్రకటించినా ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.15 డిగ్రీలకు చేరుకుంది. 2050కల్లా నెట్‌ జీరో సాధించాలంటే అన్ని దేశాలు తమ వంతు కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది. దీన్ని కర్బన బడ్జెట్‌ అంటారు. కానీ, భారత్‌ వంటి దేశాలు ఈ బడ్జెట్‌ కన్నా కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తుండగా, అమెరికా, జర్మనీ, రష్యా, బ్రిటన్‌, జపాన్‌ నిర్ణీత వాటా కన్నా 90 శాతం ఎక్కువ ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. దీనికి అవి పరిహారం చెల్లించాల్సి వస్తే అది 131 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కతేలుతుంది. చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రెజిల్‌, ఇండోనేసియా దేశాల ఉద్గారాలనూ కలుపుకొని పరిహారాన్ని లెక్కిస్తే 170 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఆ డబ్బును నిజంగా చెల్లిస్తే భారత్‌ వాటా కింద ప్రతి భారతీయుడికి 2050 వరకు తలసరిన 1,446 డాలర్ల వార్షిక పరిహారం లభిస్తుందని బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అంచనా.

భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడానికి భారత్‌ తన కర్బన ఉద్గారాలలో భారీగా కోత పెట్టుకున్నందుకు అది సముచిత పరిహారం అవుతుందని వారన్నారు. భారత్‌ వంటి వర్ధమాన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ ఉంటే పారిశ్రామిక సంపన్న దేశాలు అన్యాయంగా ఉద్గారాలను పెంచుతున్నాయని లీడ్స్‌ పరిశోధకులు అన్నారు. అంతర్జాతీయ కర్బన ఉద్గారాల తలసరి సగటు 6.3 టన్నులయితే భారత్‌ వాటా కేవలం 2.4 టన్నులని నిరుడు ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ తెలిపింది. సగటున అమెరికా 14 టన్నులు, రష్యా 13, చైనా 9.7, బ్రెజిల్‌ 7.5 టన్నుల చొప్పున, ఐరోపా సమాఖ్య 7.2 టన్నుల చొప్పున కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. తమ వాటాకు మించి కర్బన ఉద్గారాలను విరజిమ్ముతున్న దేశాలు, తక్కువ ఉద్గారాలను ప్రసరించే అల్పాదాయ దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ వినవస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని