మావోయిస్టులకు నిధులందకుండా చూడాలి.. ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం

దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు వారికి నిధులు అందకుండా చూడాలల్సిన అవసరం ఉందని ఈ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది.

Updated : 26 Sep 2021 20:47 IST

దిల్లీ: దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు వారికి నిధులు అందకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఆదివారం సమావేశం జరిగింది. ఒడిశా సీఎం నవీన్​పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్‌, బిహార్ ​సీఎం నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ ​సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రే, ఝార్ఖండ్ ​సీఎం హేమంత్​సోరెన్​ ఈ భేటీకి హాజరయ్యారు. బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్​సింగ్, అర్జున్​ముండా, నిత్యానంద రాయ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం సహా భద్రతాపరమైన లోపాలను నివారించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అమిత్ షా ఆరా తీశారు. నక్సల్ ​ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటివి సీఎంలను అడిగి తెలుసుకున్నారు. నక్సల్ ​సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏకలవ్య పాఠశాలలు, పోస్టాఫీసులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. మావోయిస్టుల సమస్యను అధిగమించడం ద్వారానే ఆయా ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అమిత్ షా అన్నారు. నక్సల్స్‌కు సంబంధించిన కేసుల విచారణ, రాష్ట్రాల మధ్య సహకారం, రాష్ట్రాల నిఘా విభాగాలు, ప్రత్యేక బలగాల సామర్థ్యం పెంపు సహా టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్థ మెరుగుపరచడం వంటి అంశాలపైనా ఈ భేటీలో చర్చించారు. ఒడిశాలో మావోయిస్టుల ఉనికి తగ్గుతోందని, కేవలం మూడు జిల్లాల్లోనే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హోంమంత్రికి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని