Delhi: ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటే ఆధార్‌ కార్డు!

ఆధార్‌ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అప్పుడేపుట్టిన పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 15 Oct 2022 20:06 IST

దిల్లీ: ఆధార్‌ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అప్పుడేపుట్టిన పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విధానం అమలు చేస్తుండగా... త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్త్‌ రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేశారు. గత ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. తాజాగా దీనిని అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) చర్యలను ముమ్మరం చేసింది.

ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్‌కార్డు తీసుకున్నప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ను నమోదు చేయడం లేదు. వారి ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. ఆ తర్వాత 5 నుంచి 15 ఏళ్ల వయస్సు మధ్యలో బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1000 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఆధార్‌ ఆధారంగానే నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధార్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు ఉడాయ్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు ఉడాయ్‌ వెల్లడించింది. గత ఏడాది ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకున్నవారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు 20 కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని