Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్‌!

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ భయాందోళన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

Updated : 30 Mar 2023 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా(corona virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అమాంతం 40శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  అయితే, కరోనా వైరస్‌  మనల్ని ఇంకా వెంటాడుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమీకాదని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నారు. అందుకోసం తగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ(Immunity)ని సహజంగా పెంచుకొనేందుకు రోజూమీరు తీసుకొనే ఆహారంలో వీటిని యాడ్‌ చేసుకుంటే భలే బూస్ట్‌ అంటున్నారు.

  • కరోనా వైరస్‌ మన దరి చేరనీయకుండా ఉండాలంటే విటమిన్‌ సీ అవసరం. ఎక్కువగా పండ్లు తినడం వల్ల తగిన మోతాదులో సీ విటమిన్‌ లభ్యమవుతుంది. ఆరంజ్‌, నిమ్మ, ఉసిరి వంటి ఆహారం ఏడాది పాటు మనకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కరోనాతో పాటు ఇతర వ్యాధులను సైతం సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది.
  • తాజా, ఆకుపచ్చని కూరగాయలు సాధారణంగానే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొవిడ్‌లాంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే మన డైట్‌లో నిత్యం ఆయా సీజన్లలో పండే ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, మెంతికూర, సోయా వంటివి మన ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తాయి. అలాగే, మన శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. 
  • ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిమాంసం, చేపలు, గుడ్లు, పన్నీర్‌, సోయా, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాలి.రోజూ శరీరానికి తగిన వ్యాయామం చేయడంతో పాటు శ్వాస సంబంధమైన టిప్స్‌ పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
  • రోజూ బెల్లం వినియోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఐరన్‌ శరీరానికి బలాన్నిస్తుంది. దీంతో పాటు నెయ్యి, పాలు, వెన్నలాంటివి మీ డైట్‌లో తగిన మోతాదులో ఉండేలా చూసుకున్నట్లయితే.. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. 
  • పండ్లు కూరగాయలకు తోడు ఆయుర్వేదిక్‌ డికాక్షన్‌ తీసుకోవడం ద్వారా మీ ఇమ్యూనిటీ మరింతగా పెంచుకోవచ్చు.  తులసి, దాల్చిన చెక్క, యాలకులు, వన్చలోచన్‌, ములేతి,  తిప్పతీగ, బెల్లంతో తయారుచేసిన కషాయం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతోంది. దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఊపిరితిత్తుల పనితీరును మరింత మెరుగుపరుస్తూ శరీరానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి.  

మరోవైపు, సీజనల్‌ ఫ్లూను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక సూచనలు చేస్తోంది. ఈ ఫ్లూ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదో జాగ్రత్తలను సూచిస్తూ ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని