భారత్‌కు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం!

కొవిడ్‌ మహమ్మారిపై భారత్‌ జరుపుతున్న పోరులో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తామంటూ ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్ల.......

Updated : 24 Apr 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారిపై భారత్‌ జరుపుతున్న పోరులో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తామంటూ ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. కరోనా రెండో దశ విజృంభణతో భారత్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన పలు దేశాలు వీలైన సాయం అందించడానికి కృషి చేస్తామని ప్రకటించాయి.

‘‘భారత్‌లో పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. నా ఆలోచనలన్నీ భారత మిత్రులపైనే ఉన్నాయి. ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేలా భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సాయం చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం’’ - జెన్‌ సాకి, శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ 

‘‘భారత్‌ మాకు గొప్ప భాగస్వామి. ఆ దేశానికి ఎలా సహాయపడగలం, ఏం చేయగలమో చూస్తున్నాం. వెంటిలేటర్లు, ఔషధాల వంటివి పంపే ప్రయత్నం చేస్తాం’’ - బోరిస్‌ జాన్సన్‌- బ్రిటన్ ప్రధాని 

‘‘కొవిడ్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత ప్రజలకు నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా. మీరు చేస్తున్న పోరాటంలో ఫ్రాన్స్‌ అండగా ఉంది. ఏ రకమైనా సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ - ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

‘‘కరోనాపై పోరాటం చేస్తున్న భారత మిత్రులకు నా సంఘీభావం. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపిన భారతదేశ దాతృత్వం, నాయకత్వం ప్రశంసనీయం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తాం’’ - మెరిస్‌ పేన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి 

‘‘భారత్‌లో కరోనా పరిస్థితిపై జర్మన్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది. భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామి. అంతర్జాతీయ సహకారం ద్వారానే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలన్న ప్రతిపాదనకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ క్రమంలో జర్మనీకి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ టాటాతో కలిసి భారత్‌కు 24 ఆక్సిజన్‌ ట్యాంకులను పంపనుంది’’ - భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం

‘‘భారత్‌ అవసరాల మేరకు సాయం అందించడానికి మేం సిద్ధంగా ఉంది. భారతీయులు త్వరలోనే మహమ్మారిని ఓడిస్తారని విశ్వసిస్తున్నాం’’ - ఝావో లిజియాన్‌, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని