నటి బంగ్లాను కక్ష సాధించేందుకే కూల్చారు: కోర్టు

కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విజయం సాధించింది. ఆమెకు అనుకూలంగా ముంబయి కోర్టు  తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది....

Updated : 27 Nov 2020 16:24 IST

కంగనాకు అనుకూలంగా తీర్పు వెల్లడించిన ముంబయి కోర్టు

ముంబయి: కార్యాలయం కూల్చివేత కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు అనుకూలంగా ముంబయి కోర్టు  తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంపై కోర్టు.. బీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్ష సాధించేందుకే ఆమె బంగ్లాను కూల్చివేశారంటూ పేర్కొంది. తన బంగ్లాను అక్రమంగా కూల్చి వేశారంటూ రెండు నెలల క్రితం కంగనా వేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు పరిశీలించింది. ‘కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. బాధ్యత లేని ఓ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ఇందుకు ఆమెపై మీ బలాన్ని చూపించాల్సింది కాదు’ అని పేర్కొంది. 

శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ప్రచురితమైన వార్తలు, ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ చేసిన పలు వ్యాఖ్యల క్లిప్పింగులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కంగనాపై బెదిరింపులకు పాల్పడ్డట్లు స్పష్టం చేసింది. ‘బీఎంసీది కక్ష్య సాధింపు చర్య. కంగనాను బెదిరించేందుకే ఆమె కార్యాలయాన్ని కూల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని జస్టిస్‌ ఎస్‌జే కతావళ్ల, జస్టిస్‌ రియాజ్‌ చగ్లాతో కూడిన బెంచ్‌ పేర్కొంది. నటికి జరిగిన నష్టాన్ని బీఎంసీనే పూడ్చాలని తీర్పు వెల్లడించింది. కూల్చివేసిన భాగాన్ని పునర్‌నిర్మించేందుకు బీఎంసీకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం కంగనాకు సూచించింది. కూల్చివేయని ప్రాంతాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా ఆమె దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

కోర్టు తీర్పుపై కంగనా రనౌత్‌ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించింది. ‘ఓ వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలిస్తే అది ఆ ఒక్క వ్యక్తి గెలుపు మాత్రమే కాదు.. అది ప్రజాస్వామ్య గెలుపు. ఈ కేసు వ్యవహారంలో నాకు మద్దతుగా నిలిచిన వారితోపాటు, నా కలలను చిదిమివేసినందుకు గాను నవ్వినవారికి కూడా నా ధన్యవాదాలు’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. ఈసందర్భంగా బీఎంసీ ఫొటోతోపాటు, ఆమె ఫొటోను జోడిస్తూ మీరు విలన్‌గా మారితే నేను హీరోనయ్యాను అంటూ ట్వీట్‌ చేసింది. 

నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు దర్యాప్తు గురించి కంగనా మాట్లాడుతూ మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే భయంగా ఉందని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కాస్తా రాజకీయ దుమారం రేపాయి. దీంతో శివసేన నేత సంజయ్‌రౌత్‌కు, కంగనకు మధ్య కొన్నిరోజుల పాటు మాటల యుద్ధం సాగింది. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్‌ 9వ తేదీన ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బాంద్రాలోని కంగనా రనౌత్‌ కార్యాలయ కూల్చివేత ప్రారంభించింది. బంగ్లాలోని కొంత భాగాన్ని కూల్చివేసింది. దీంతో నటి ముంబయి కోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు ఆపాలంటూ కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. తన కార్యాలయాన్ని అక్రమంగా కూల్చివేసినందుకుగానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని నటి డిమాండ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని