Baahubali 3: ‘బాహుబలి’ రాజ్యం మళ్లీ..

తెలుగు చిత్రసీమ స్థాయిని.. భారతీయ సినిమాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ‘బాహుబలి’ చిత్రాలు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు

Updated : 15 Mar 2022 11:48 IST

తెలుగు చిత్రసీమ స్థాయిని.. భారతీయ సినిమాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ‘బాహుబలి’ చిత్రాలు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్నాయి. ఈ విజయవంతమైన సిరీస్‌కు కొనసాగింపుగా ‘బాహుబలి-3’ని చేస్తే బాగుంటుందని సినీప్రియులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దీనిపై దర్శకుడు రాజమౌళి ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బాహుబలి1’, ‘బాహుబలి2’ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. అలాగే ‘బాహుబలి’కి కొనసాగింపుగా మరో చిత్రం ఆశించవచ్చా?’’ అని అడగ్గా.. ‘‘తప్పకుండా ఆశించొచ్చు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి మా నిర్మాత శోభు యార్లగడ్డ సుముఖంగా ఉన్నారు. దీన్ని చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు. భవిష్యత్తులో ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఓ ఆసక్తికరమైన వార్త తప్పక వస్తుంది’’ అని దర్శకధీరుడు బదులిచ్చారు. ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజమౌళి ప్రకటనపై సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఇటీవలే ప్రభాస్‌ ‘బాహుబలి-3’పై స్పందించారు.   ‘‘బాహుబలి-3’ గురించి ఇప్పటికైతే నాకేం తెలియదు. టైమ్‌ వస్తే ఏదైనా జరగొచ్చ’’ని వ్యాఖ్యానించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని