DSP: చిరంజీవి నవ్విస్తారు.. ఏడిపిస్తారు

‘‘చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పూర్తిస్థాయి పక్కా మాస్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కథకు తగ్గట్లుగానే ఈ సినిమాకి కొత్తదనంతో నిండిన సంగీతమందించా’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌.

Updated : 13 Jan 2023 08:28 IST

‘‘చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పూర్తిస్థాయి పక్కా మాస్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). కథకు తగ్గట్లుగానే ఈ సినిమాకి కొత్తదనంతో నిండిన సంగీతమందించా’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad). చిరంజీవి (Chiranjeevi) టైటిల్‌ పాత్రలో నటించిన ఈ సినిమాని బాబీ (Bobby) (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రవితేజ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం విలేకర్లతో ముచ్చటించారు దేవిశ్రీ.
‘‘ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో.. ఆయన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో.. అవన్నీ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు బాబీ సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి మనందరినీ నవ్విస్తూ ఏడిపిస్తారు. ఏడిపిస్తూ నవ్విస్తారు. ఆయన నటన థియేటర్లలో మనందరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. రవితేజ (Ravi Teja) పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’.

* ‘‘ఈ చిత్ర సంగీతం విషయంలో నేనెప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. ఎందుకంటే దర్శకుడు బాబీ నాకు సోదరుడు లాంటి వాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం.. చక్కటి అవగాహన ఉన్నాయి. అదే సమయంలో చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్‌ కలిసి చేస్తున్న చిత్రం కాబట్టి వాళ్లు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా. కథకు తగ్గట్లుగా సంగీతం కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. ‘పూనకాలు లోడింగ్‌’, ‘బాస్‌ పార్టీ’, ‘వీరయ్య’.. ఇలా ఇప్పటి వరకు  విడుదలైన ప్రతి పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మధ్యే చిరంజీవి సినిమా చూశారు. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి ‘విశ్వరూపం చూపించావు’ అని ప్రశంసించారు. ఎంతో సంతృప్తిగా అనిపించింది’’.

* ‘‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ గర్వకారణమిది. ‘పుష్ప’ పాటలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఆదరణ దక్కించుకున్నాయి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా.. ఆ పాటల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ ఆదరణను దృష్టిలో పెట్టుకునే ‘పుష్ప2’ పాటల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని