Bigg boss 7 telugu: అమర్‌, ప్రశాంత్‌ అభిమానుల మధ్య గొడవ.. ఆర్టీసీ బస్సు ధ్వంసం

bigg boss 7 telugu: పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య అన్నపూర్ణా స్టూడియోస్‌ బయట గొడవ జరిగింది.

Updated : 18 Dec 2023 11:57 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu) టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth) గెలుచుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ (Amardeep) నిలిచాడు. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు వచ్చారు. ప్రశాంత్‌ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు.

మరోవైపు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్‌ దీప్‌ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని