Chiranjeevi: ఆ ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నారు

‘‘గోపీచంద్‌ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్‌. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో

Updated : 27 Jun 2022 13:18 IST

‘‘గోపీచంద్‌ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్‌. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల చప్పట్లే మాకు ఉత్సాహాన్నిస్తాయి. థియేటర్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో, ఎలాంటి స్పందన వస్తుందో ఈ వేడుకే చెబుతోంది. అరవింద్‌ ఫోన్‌ చేసి గోపీచంద్‌, మారుతి ‘మిమ్మల్ని రమ్మంటున్నారు’ అని అడగ్గానే నేనెక్కువ సమయం తీసుకోలేదు. గోపీ విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎదుగుతున్నాడు. ‘పక్కా కమర్షియల్‌’తో మరో స్థానానికి వెళతాడు. దర్శకుడు మారుతిలో ప్రతిభని ఆరంభంలోనే గమనించా. నీలో దర్శకుడున్నాడని నేను చెప్పిన మాట గుర్తు పెట్టుకుని తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి ఎదిగాడు. తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసినవాడు. యు.వి.క్రియేషన్స్‌కి చెందిన విక్కీ, వంశీ వచ్చి మారుతి దర్శకత్వంలో మీతో సినిమా చేయాలనుందని అడిగారు. ఆ సినిమాకి ఈ వేదికపైనే అంగీకరం చెబుతున్నా. ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాల్లో రాశి చాలా బాగా నటించింది. రావు రమేష్‌ తన తండ్రి రావు గోపాలరావు స్ఫూర్తితో గొప్ప పాత్రలు చేస్తున్నారు. ఆయన స్థానాన్ని తప్పకుండా భర్తీ చేస్తారు. ఒక మంచి బృందం కలిసి చేసిన ఈ సినిమాతో థియేటర్లు కళకళలాడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘నేను చిత్ర పరిశ్రమకొచ్చి ఇన్నేళ్లైనా చిరంజీవి నా వేడుకకి రాలేదు. మేమంతా వెళ్లి అడగ్గానే వస్తానని చెప్పారు. ఏ నేపథ్యం లేకపోయినా పట్టుదలతో వచ్చి పరిశ్రమకి ఓ మహావృక్షంలా నిలబడ్డారు. ఈ సినిమా నేను చేయడానికి కారణం నా స్నేహితుడు వంశీ. మారుతిలోని ప్రతిభకి చాలా పెద్ద స్థాయికి వెళతాడు. రాశిఖన్నాకి ఇంతకుముందు నాతో కలిసి చేసిన సినిమాల్లో సరైన పాత్రలు పడలేదు. ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది’’ అన్నారు.

* అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇన్నేళ్ల తర్వాత నా సంస్థలో గోపీచంద్‌తో ఓ మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. మారుతి సన్నివేశం నుంచి బయటికెళ్లి వినోదం పండిస్తుంటారు. తను సినిమా గ్రామర్‌ తెలిసిన వ్యక్తి’’ అన్నారు.

* రాశిఖన్నా మాట్లాడుతూ ‘‘నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తతమైనద’’న్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్‌, దిల్‌రాజు, రావు రమేష్‌, వంశీ, విక్కీ,  సియాగౌతమ్‌, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, వైవాహర్ష, సప్తగిరి, ప్రవీణ్‌, పవన్‌ సాదినేని, పవన్‌, కౌశిక్‌, సుబ్బు, అజయ్‌ ఘోష్‌, జానీ, వివేక్‌ కూచిభొట్ల, కృష్ణకాంత్‌, ఎస్‌.కె.ఎన్‌ తదితరులు పాల్గొన్నారు.

* మారుతి మాట్లాడుతూ ‘‘భావోద్వేగంతో కూడిన రోజు ఇది. బందరులో చిరంజీవి బొమ్మలేసుకుంటూ బ్యానర్లు రాసుకునే ఓ ఆర్టిస్ట్‌ని నేను.నా సినిమా వేడుకకి చిరంజీవి వచ్చారంటే అది సాధారణ విషయం కాదు. ఎవరైనా గట్టిగా అనుకుంటే సాధించగలరని అందరికీ చెబుతాను. ‘పక్కా కమర్షియల్‌’ సినిమాని చాలా బాగా తీశాం’’ అన్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని