Nagarjuna: ఎన్నో కథలున్నాయి... మనమే చెప్పడం లేదు!

హిందీ చిత్రసీమలో తెలుగు జెండా రెపరెపలాడుతోంది. మన కథానాయకులు... మన దర్శకనిర్మాతలు అక్కడ సత్తా చాటుతున్నారు. అయితే ఈ ట్రెండ్‌ కొత్తదేమీ కాదు. 1990వ దశకంలోనే నాగార్జున ఉత్తరాది ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ తర్వాత కూడా తరచూ అక్కడ సందడి చేస్తూ వచ్చారు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’లోనూ

Updated : 14 Sep 2022 07:08 IST

హిందీ చిత్రసీమలో తెలుగు జెండా రెపరెపలాడుతోంది. మన కథానాయకులు... మన దర్శకనిర్మాతలు అక్కడ సత్తా చాటుతున్నారు. అయితే ఈ ట్రెండ్‌ కొత్తదేమీ కాదు. 1990వ దశకంలోనే నాగార్జున ఉత్తరాది ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ తర్వాత కూడా తరచూ అక్కడ సందడి చేస్తూ వచ్చారు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’లోనూ నంది అస్త్రంగా మెరిశారు. ఆ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదలైంది. ఈ సందర్భంగా నాగార్జున మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 

హిందీలో చాలా విరామం తర్వాత సినిమా చేశారు. ‘బ్రహ్మాస్త్రం’ ఫలితం సంతృప్తినిచ్చిందా? 

నేను ముందు నుంచీ సినిమాపై నమ్మకంగా ఉన్నా. అతిథి పాత్రలా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ కథలో కీలకమైన పాత్రని పోషించా. దర్శకుడు అయాన్‌ కూడా సినిమాలో మీ పాత్రంటే నాకు చాలా ఇష్టమని చెప్పేవాడు. విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా,  ఉత్తరాది నుంచి కూడా గొప్ప స్పందన వచ్చింది. అక్కడున్న చాలా మంది స్నేహితులు నాకు సందేశాలు పంపించారు, థియేటర్లలో సందడిని వీడియోలుగా తీసి పంపించారు. ఈ సినిమా ప్రయాణం ఓ అద్భుతమైన అనుభవం. ఘనమైన విజువల్స్‌, గొప్ప పాత్ర... ఇలా అన్నీ చాలా బాగా కుదిరాయి. వీటన్నిటితోపాటు నందితో నాకేదో అనుబంధం ఉంది. ‘ఢమరుకం’లో కూడా నంది నేపథ్యం ఉంటుంది. ఇందులోనూ అంతే. దర్శకుడు అయాన్‌ ఏం చెప్పాడో అదే తీశాడు. 

తదుపరి సినిమాల్లో కూడా మీ పాత్ర కొనసాగుతుందా? 

మూడు భాగాలుగా ఉంటుందనే ఈ కథ చెప్పాడు అయాన్‌. జనాలకి నచ్చిన పాత్రల్ని ఎవ్వరూ వదులుకోరు కదా. అయితే తొలి భాగం తీస్తున్నప్పుడు దాని గురించే దృష్టిపెట్టాం తప్ప, తర్వాత సినిమాల గురించి ఆలోచించలేదు. ఎవ్వరికైనా భయం ఉంటుంది కదా, తొలి భాగం ఎలా ఆడుతుందో అని! అయితే ఇప్పుడు మార్వెల్‌ సినిమాల్లా ‘బ్రహ్మాస్త్రం’ మలిభాగం  కథలు కూడా ఉంటాయి. 

ఇన్నేళ్ల తర్వాత హిందీలో సినిమా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? 

హిందీలో సినిమాలన్నీ ఓ నటుడిగా నాకున్న పాషన్‌కొద్దీ చేసినవే. జక్మ్‌, ఖుదాగవా, అగ్నివర్ష... ఇలా ఆయా  పాత్రలు నచ్చడం, కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందనే భావనతో ఆ సినిమాలు చేశా. ఇలాంటి ప్రయత్నాలతో మానసికంగా కూడా నన్ను నేను మరింతగా విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ‘బ్రహ్మాస్త్ర’ కోసం బల్గేరియా వెళ్లా, లండన్‌కి తీసుకెళ్లారు. అక్కడి వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు, ఆ సాంకేతికత... ఇదంతా చాలా అనుభవాన్నిచ్చింది. పైగా దర్శకుడు అయాన్‌  పాన్‌ ఇండియా ట్రెండ్‌ లేని సమయంలోనే నన్ను వెదుక్కుంటూ వచ్చి ఈ కథ చెప్పాడు. నా ‘శివ’ చూసి, ఆ పాత్రని నేను సూట్‌ అవుతానని భావించి నా దగ్గరికి వచ్చాడు. అయాన్‌, కరణ్‌, రణ్‌బీర్‌, అలియా, మోనికా... ఇలా చాలా సన్నిహితులతో కలిసి పనిచేసిన అనుభవం కలిగింది. 

మన పురాణాలు, మన సంస్కృతిలోని కథల్ని మరో స్థాయికి తీసుకెళ్లి తీసే సమయం ఇదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. మీరేం అంటారు? 

రాజమౌళి ఎప్పుడూ చెబుతుంటారు ఈ ఈ విషయాన్ని. మన దగ్గర ఎన్నో కథలున్నాయి. మనమే చెప్పుకోవడం లేదు. హాలీవుడ్‌వాళ్లు అసలు  కథల్లేకుండానే వాటిని అంతంత పెద్దగా చేసి సినిమాలు చేస్తున్నారు. ‘గేమ్‌ ఆఫ్‌  థ్రోన్స్‌’, ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వాళ్లు సృష్టించిన కథలే. మనకు ఆ అవసరమే లేదు. మహాభారతం చూస్తే ఎన్ని అధ్యాయాలు? ఇంకెన్ని పాత్రలు? ఇప్పటికైనా మన భారతీయ దర్శకులు, నిర్మాతలు మేల్కోవడం సంతోషకరం. మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’  తీస్తున్నారు. ‘బాహుబలి’ లేకపోతే ఆయన కూడా తీసేవారు కాదేమో!  అంత ధైర్యం రావాలి కదా. 

విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన కథల ప్రాభవం క్రమంగా పెరుగుతోంది. ఇక రియలిస్టిక్‌ కథలు కనుమరుగవుతాయేమో కదా? 

కథల్ని మరింత రియలిస్టిక్‌గా తీయడానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ దోహదం చేస్తున్నాయి. ‘బాహుబలి’ తరహా సినిమాల్ని రియల్‌గా చేయలేం కదా. అలాంటి కథల్ని మరింత సహజంగా తీయాలంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కావల్సిందే. హాలీవుడ్‌లో కూడా ఒకప్పటిలా రెగ్యులర్‌ సినిమాలు ఇప్పుడు కనిపించవు. 

‘ది ఘోస్ట్‌’ ఎలా ఉండబోతోంది? 

చాలా నమ్మకంగా ఉన్నా. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన లభించింది. నాకు గొప్ప మార్పు అని చెప్పను కానీ, సాంకేతికంగా చాలా బలంగా ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుని ఇంతకాలం నేనెందుకు  గుర్తించ లేదా అని బాధపడ్డా. మరో స్థాయిలో యాక్షన్‌ ఘట్టాలుంటాయి. అవే కాకుండా... అన్న, చెల్లి నేపథ్యంలో మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి.   

మన కథల గమనం ఎలా ఉంది? ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? 

రిస్క్‌ ఎప్పుడూ ఉంటుంది. కథల పరంగా పాత రోజుల్లో ఎలాంటి శ్రద్ధ తీసుకునేవాళ్లో ఆ పద్ధతులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నిర్మాతలు కంటెంట్‌ చూసుకుంటున్నారు. దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ‘సీతారామం’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలే అందుకు ఉదాహరణ. విడుదలకి ముందు వరకు కూడా ‘ఒకే ఒక జీవితం’ శాటిలైట్‌ హక్కులు, ఓటీటీ హక్కులు అమ్మలేదు. సినిమాపై వాళ్లకున్న నమ్మకం అది. ఆ నమ్మకం కథల నుంచే వస్తుంది. 

ఓటీటీల ప్రభావం సినిమాపై ఎలా ఉంది? 

మనం తమిళం, మలయాళం తప్పితే మిగతా భాషల్లో సినిమాల్ని అంతగా చూసేవాళ్లం కాదు.  ఎవరైనా చెబితే బెంగాలీ సినిమాని తెప్పించుకుని చూసేవాళ్లం. ఇప్పుడు జర్మన్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌... ఇలా అన్ని భాషల సినిమాల్నీ చూసేస్తున్నాం. చాలామంది ఓటీటీల రాకతో సినిమా చచ్చిపోతుందని అంటుంటారు కానీ,  నా అభిప్రాయంలో మాత్రం  సినిమా మరింతగా పెరుగుతోంది. కాకపోతే అందుకు అనుగుణంగా దర్శకులు, నటులు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. లేదంటే తిరోగమనమే. 

కథలో ఎంపికలో ఓ నటుడిగా ఎలాంటి మార్పు అవసరం  అంటారు? 

నా వరకైతే నంబర్స్‌ కోసమని, మిగతా విషయాల కోసమనీ కథల్ని ఎంపిక చేసుకోవడం ఎప్పుడో మానేశాను. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ, నచ్చని కథల్ని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నా. 38 యేళ్లు పరిశ్రమలో కథానాయకుడిగా కొనసాగుతున్నానంటే నటుడిగా నేను చాలా సాధించినట్టే. ఇప్పటికీ నా సినిమాలు చూసి మెచ్చుకుంటున్నారంటే చాలు కదా. జీవితంలోని ఈ దశని చాలా ఆస్వాదిస్తున్నా. అన్నిటికంటే కూడా మానసికంగా నాపైన ఉన్న బరువు తగ్గించుకున్నట్టుగా భావిస్తున్నా. పెట్టుబడి పెట్టిన నిర్మాత డబ్బు చేసుకోవడం ముఖ్యమనే విషయాన్ని మా నాన్న నాకు నేర్పించారు. నటుడిగా నా శక్తి ఎంత? నా సినిమాలు ఎంత వసూలు చేస్తాయనేది నాకు తెలుసు. సెట్‌కి వెళితే అందరం సంతోషంగా పనిచేసుకోవాలి. అంతే కానీ... అనవసరమైన లెక్కల కోసమని లేని ఒత్తిడి సినిమా బృందంపై ఉండకూడదు. ఇప్పటికే ప్రేక్షకుడు వస్తాడా రాడా? అనే ఒత్తిడి ఉండనే ఉంటుంది.


ఏ బంధంలోనైనా ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోతే ప్రేమ ఉండదు. అమల, నేను భార్యాభర్తలుగాకంటే కూడా స్నేహితుల్లా ఉంటాం. ఒకరి పనిని మరొకరు అభినందించుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. ఇద్దరి మధ్య అది ఉందంటే ఇంకేమీ అవసరం లేదు. తను నేను, పిల్లలు సినిమాల గురించి మాట్లాడుకుంటాం కానీ, తినేటప్పుడు కాదు (నవ్వుతూ). సినిమాల విషయంలో అమలకి నేనెప్పుడూ సలహాలు ఇవ్వను. తను  బిజీగా ఉంటుంది. కథ, పాత్రలు నచ్చితేనే  చేస్తుంది. కొన్ని హిందీ వెబ్‌ సినిమాలు కూడా చేసింది. తెలుగులో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత ‘ఒకే ఒక జీవితం’ చేసింది. ఆ సినిమా చేసేటప్పుడే ‘నువ్వు బాగా కనెక్ట్‌ అవుతావు. ‘మీ అమ్మగారు, ఆ  జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి’ అని చెప్పింది. సినిమా చూశాక భావోద్వేగానికి  గురయ్యాను’’.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని