coolie: రజనీకాంత్‌ చిత్రం... కూలీ

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

Updated : 23 Apr 2024 09:31 IST

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ ప్రేమికులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. సోమవారం చిత్రబృందం ఓ వీడియో చిత్రం ద్వారా సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, కథా నేపథ్యాన్నీ పరిచయం చేశారు. అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో సాగే  కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది.  

మరోవైపు ఇందులో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్‌ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో తెలుగు కథానాయకుడు నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవలే లోకేశ్‌ కనగరాజ్‌ హైదరాబాద్‌కి వచ్చి నాగార్జునతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఇందులో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. నాగార్జున ఇప్పటికే ధనుష్‌తో కలిసి, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.


రకుల్‌ తండ్రిగా  అనిల్‌ కపూర్‌?

క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో అభిమానుల్ని మెప్పిస్తుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించిందామె. త్వరలో ‘దే దే ప్యార్‌ దే 2’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆమె, అజయ్‌ దేవగణ్‌ జంటగా నటిస్తున్న ఈ  చిత్రాన్ని అన్షుల్‌ శర్మ తెరకెకికస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.


డీప్‌ఫేక్‌పై ఫిర్యాదు చేసిన రణ్‌వీర్‌

చిత్రపరిశ్రమలో రష్మిక మొదలుకొని ఎంతో మంది నటీనటులు డీప్‌ఫేక్‌ బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీప్‌ఫేక్‌ వలలో చిక్కిన బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవలే రణ్‌వీర్‌ వారణాసిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలోని వీడియోను కృత్రిమ మేధస్సు సహాయంతో ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు సృష్టించారు. దీనిపై స్పందించిన ఆయన.. డీప్‌ఫేక్‌ వీడియోను ప్రచారం చేస్తున్న ఖాతాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలకు నటీనటులు ప్రచారం చేస్తున్నట్లు రూపొందిస్తున్న ఈ డీప్‌ఫేక్‌ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.


‘బ్యూటీ’ ప్రారంభం

రావు రమేశ్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్యూటీ’. అంకిత్‌ కొయ్య, విశాఖ ధిమన్‌ నాయకానాయికలు. బాల సుబ్రహ్మణ్యమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతి టీమ్‌ ప్రొడక్ట్‌, వానరా సెల్యూలాయిడ్‌ సంస్థలపై ఎ.విజయపాల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, మరో దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకులు వీరశంకర్‌, సుబ్బు మంగాదేవి, డార్లింగ్‌ స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న నటుడు మిథున్‌ చక్రవర్తి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని