MAA Elections: ప్రకాశ్‌రాజ్.. నా ఫ్యామిలీ పేరెత్తితే బాగుండదు: మంచు విష్ణు

ఒక కుటుంబంలో జరిగే ఎన్నికల్లో ప్రతి విషయాన్ని తీసుకొచ్చి, ప్రకాశ్‌రాజ్‌ మీడియా ముందు పెడుతున్నారని, ప్రతి దానికీ తీవ్రంగా స్పందిస్తున్నారని మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఆరోపించారు.

Updated : 05 Oct 2021 20:05 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల్లో తన కుటుంబాన్ని తీసుకురావద్దని, ‘మంచు ఫ్యామిలీ’ అంటూ మాట్లాడితే ఊరుకునేది లేదని సినీ నటుడు, మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు.. ప్రకాశ్‌రాజ్‌ను హెచ్చరించారు. మరోసారి అలా మాట్లాడితే ఆయనకున్న గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటారని ధ్వజమెత్తారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయమై వివాదం తలెత్తిన నేపథ్యంలో విష్ణు విలేకరులతో మాట్లాడారు. ఉదయం ప్రకాశ్‌రాజ్‌ చెప్పిన ప్రతి అంశానికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘మా ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. పేపర్ బ్యాలెట్ చాలా సార్లు లెక్కించేందుకు అవకాశం ఉంది. ‘మా’లో 160 కిపైగా 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఆయన బాగా నటిస్తున్నారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఆయనకు మాపై పగ-ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు. ఎన్నికల సంఘం వద్దకు వచ్చి పరిష్కరించుకుంటే అయిపోయేది. ఈవీఎంలు వద్దని ‘మా’కు లేఖ రాశా. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ పేపర్‌ బ్యాలెట్‌ వాడారు. ఇవి అయితే, ఎన్నిసార్లు అయినా లెక్కపెట్టుకోవచ్చు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంది’’

పేపర్‌ బ్యాలెట్‌ 200సార్లు అయినా లెక్కపెట్టుకోవచ్చు

‘‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌లు వద్దని, నాకు పేపర్‌ బ్యాలెట్‌ కావాలని లెటర్‌ పెట్టాను. ఈవీఎంలు విషయంలో మా సలహా తీసుకోలేదు. ఎన్నికలు దగ్గరకొచ్చే సమయంలో మా ప్యానెల్‌లో చాలా మంది ‘ఈవీఎంలు వద్దు పేపర్‌ బ్యాలెట్‌ పెట్టండి’ అని కోరారు. నేను ఈవీఎంలకు వెళ్దామని చెప్పినా, వద్దని వారించారు. అందుకే లేఖ రాశా. రేపు మేము(విష్ణు ప్యానెల్‌) గెలిచిన తర్వాత ‘ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు?విష్ణుకు ఆ సత్తా ఉంది. వాళ్లూ వీళ్లూ  సాయం చేశారు’ అని పూనకం వచ్చినట్లు ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడతారు. అందుకే పేపర్‌ బ్యాలెట్‌ అయితే, 200 సార్లు అయినా లెక్కపెట్టుకోవచ్చు. మీరే(ప్రకాశ్‌రాజ్‌) స్వయంగా లెక్కపెట్టుకోవచ్చు. ఆ తర్వాత గెలుపు నాదేనని మీకు తెలుస్తుంది. 60ఏళ్లు పైబడిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ‘మా’లో సుమారు 160మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ నేను వ్యక్తిగతంగా ఫోన్‌ చేశా. ‘మీకు పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలా? అని అడిగా. ‘నేరుగా వచ్చి ఓటు వేస్తా’మని 100మందికి పైగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, ఇక్కడే నగరంలో ఉన్న పరుచూరి బ్రదర్స్‌ వంటి పెద్దలు ‘పోస్టల్‌ బ్యాలెట్‌కు వెళ్తా’మని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తెలుపుతూ మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని పెద్దలకు సూచించా. ఎలా పంపాలో వాళ్లకు తెలియకపోతే ఒక లెటర్‌ ఫార్మాట్‌ పంపా. అయితే, ఎవరికి వారే కొరియర్‌ చేసుకున్నారు. ఆ లెటర్లను ఒక వ్యక్తి మాత్రం తీసుకురాలేదు’’

ప్రకాశ్‌రాజ్‌.. పెద్దలను అవమానిస్తారా?

‘‘పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలంటే రూ.500 కట్టమని ఎన్నికల సంఘం ‘మా’ సభ్యులకు ఎస్‌ఎంఎస్‌ పంపింది. దాంతో పలువురు పెద్దలు నాకు ఫోన్‌ చేసి అడిగారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమే. అందుకే ‘మీ అందరి తరపున ఆ రూ.500  నేను కడతా’ అని వాళ్లకు చెప్పా. ఇదే విషయమై ఎన్నికల సంఘం దగ్గరికి వచ్చి అడిగాం. వాళ్లు ఒప్పుకొన్నారు. న్యాయబద్ధంగా కట్టాం.  కొన్ని గంటల తర్వాత ఎన్నికల సంఘం నుంచి మాకు ఫోన్‌ వచ్చింది. ‘పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తాం. మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి’ అని చెప్పారు. వాళ్లు చెప్పగానే వచ్చి, డబ్బులు తీసుకున్నాం. అన్నీ లీగల్‌గానే జరిగాయి’’

‘మా’అసోసియేషన్‌ను విడగొట్టాలని చూస్తున్నారు!

‘‘పోస్టల్‌ బ్యాలెట్‌ విషయమై సీనియర్‌ నటుడు శరత్‌బాబుగారితో మాట్లాడా. ఈ మేధావి(ప్రకాశ్‌రాజ్‌) శరత్‌బాబుగారిని తన స్నేహితుడు అని చెప్పుకొంటున్నారు. నిజానికి ఆయన మా నాన్న రూమ్మేట్‌. శరత్‌బాబుగారికి ప్రకాశ్‌రాజ్‌ ఫోన్‌ చేస్తే ‘అవును కట్టారయ్యా. వాళ్లకు గూగుల్‌ పే చేస్తా’ అన్నారట. ఎవరికీ తెలియకుండా భయపెట్టి ఓట్లు పొందాలని చూస్తే మీరు తప్పకుండా ప్రశ్నించవచ్చు. నోరు ఉంది కదాని పెద్దా-చిన్నా తేడా లేకుండా మాట్లాడకూడదు. కృష్ణంరాజు, కృష్ణగార్లను అవమానిస్తారా? పరుచూరి బ్రదర్స్‌ వాళ్ల సొంత డబ్బు కట్టారు. మద్రాసు నడిగర్‌ సంఘంలో ఒక ప్యానెల్‌ను గెలిపించి, మళ్లీ దాన్ని విభజించారు. ప్రకాశ్‌రాజ్‌ అహంకారి. తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఈయనను అడుగు పెట్టనివ్వరు. ఇక్కడకు వచ్చి ఉమ్మడిగా ఉన్న ‘మా’ అసోసియేషన్‌ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’’అని ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నా ఫ్యామిలీ పేరు తీస్తే బాగుండదు!

ఇక నటీనటులు జీవిత, శ్రీకాంత్‌పైనా విష్ణు మండిపడ్డారు. ‘‘మేము ఎలా గెలుస్తామో జీవితగారికి ఇప్పుడు అర్థమైందట. మీరు రాజశేఖర్‌గారితో ఒక సినిమా నిర్మిస్తున్నారు. మీరు ఫైనాన్షియర్స్‌ దగ్గరకు వెళ్లి ‘ఈ సినిమా ఫ్లాప్‌ అవుతుంది’ అని చెప్పి డబ్బులు తీసుకుంటారా? ఎవరైనా పాజిటివ్‌గా ఆలోచించాలి. ప్రకాశ్‌రాజ్‌ గెలిస్తే మొదటి ఫోన్‌ కాల్‌ నాకు చేసి, ‘మా భవనం కట్టడానికి ల్యాండ్‌ ఎక్కడ కొని పెడతారు’అని అడుగుతారట. నేను సిద్ధమే! ఆయన అలా మాట్లాడితే తప్పులేదు కానీ, మేము ఏదైనా అంటే విమర్శిస్తారా? ‘మీరు ఓటు వేయడానికి రావొద్దు’ అని మేము చెప్పామట. అలా ఎలా చెబుతాం? మీరు మాట్లాడే దానిలో కొంచెమైనా విజ్ఞత ఉందా? నాలుగు రోజులు ముందు రాజశేఖర్‌గారు వచ్చి నాన్నను కలిసి ఏం మాట్లాడారో ఆయన్నే అడగండి. ప్రకాశ్‌రాజ్‌ గారు.. ఇంకోసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే మీకు ‘గారు’ అని ఇస్తున్న గౌరవం ఉండదు. నేను అధ్యక్ష అభ్యర్థిని, మీకు దమ్ము, సత్తా ఉంటే నా పేరే తీయండి. మా అక్క, తమ్ముడు, నాన్నను లాగకండి. ప్రతి దానికీ ‘మంచు ఫ్యామిలీ’ పేరు ఎందుకు తీస్తున్నారు? నా కోసం నా కుటుంబం ఓటు అడగవచ్చు. ఓటు వేయమని అడగటానికి మీరు ఫోన్‌చేస్తే గిరిబాబుగారు ఇచ్చిన క్లాస్‌ సరిపోదా?శ్రీకాంత్ గారు.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్యానెల్‌లో ఉన్న హేమ, బెనర్జీగారు మీరందరూ నాకు ఇష్టమే. 10వ తేదీ తర్వాత మనం మనం ముఖాలు చూసుకోవాలి. 11వ తేదీన ప్రకాశ్‌రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతారు. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. మేమంతా మీ కుటుంబం. మేము ఎవరినీ విమర్శించటం లేదు. ‘మా’ అసోసియేషన్‌ ఒక ఫ్యామిలీ. దయచేసి విడగొట్టకండి’’

శ్రీహరి ఉంటే మీకు తగిన గుణపాఠం చెప్పేవారు

‘‘ప్రకాశ్‌రాజ్‌.. నటుడు శ్రీహరిగారు ఇప్పుడు ఉండి ఉంటే మీకు తగిన గుణపాఠం చెప్పేవారు. మిమ్మల్ని శ్రీహరి అంకుల్ నాన్నగారి దగ్గరకు తీసుకొస్తే, ‘అన్నయ్యా’ అంటూ కాళ్లకు దండం పెట్టింది మర్చిపోయారు. ‘వస్తాడు నారాజు’ సినిమా షూటింగ్‌లో నా డైరెక్టర్‌ను దుర్భాషలాడారు. ఎందుకు ఇప్పుడు విషం కక్కుతున్నారు. నాకు నా తండ్రి సపోర్ట్‌ ఉంది. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోను’’ అని మంచు విష్ణు ఆవేశంతో ప్రసంగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని