Nani: అలాంటి బలమైన కథ ఇది

నేను ఓ కథ వింటున్నప్పుడే.. అందులోని ప్రపంచాన్ని, దాంట్లో నా పాత్రని ఊహించుకుంటా. సీన్‌ పేపర్‌ చదువుకుని కెమెరా ముందుకొచ్చాక.. దాన్ని రీక్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తా’’ అన్నారు నాని. జయాపజయాలతో సంబంధం లేకుండా

Updated : 23 Dec 2021 07:19 IST

‘‘నేను ఓ కథ వింటున్నప్పుడే.. అందులోని ప్రపంచాన్ని, దాంట్లో నా పాత్రని ఊహించుకుంటా. సీన్‌ పేపర్‌ చదువుకుని కెమెరా ముందుకొచ్చాక.. దాన్ని రీక్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తా’’ అన్నారు నాని. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరిత కథలతో ప్రయాణం చేసే కథానాయకుడాయన. ఇటీవలే ‘టక్‌ జగదీష్‌’తో ఓటీటీ వేదికగా వినోదాలు పంచిన ఆయన.. ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రంతో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన ఈ సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలుపంచుకున్నారు నాని. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..  

రెండేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు. ఎలా అనిపిస్తోంది?

‘‘థియేటర్లో సినిమా చూడటాన్ని నేనేంతో ఆస్వాదిస్తుంటా. కొవిడ్‌ పరిస్థితుల వల్ల అనుకోకుండా బ్రేక్‌ వచ్చింది. థియేటర్లు లేవు. చేసిన సినిమాల్ని ప్రేక్షకులకు చేరువ చేయడానికి ఓటీటీలు తప్ప మరో మార్గం లేదు. అందుకే ఆ బాట పట్టాం. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆ థియేటర్‌ అనుభూతిని  రుచి చూడనున్నా. చాలా ఆనందంగా.. ఆతృతగా ఉంది’’.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని గత కాలంలోకి తీసుకెళ్తున్నారు. ఎలా ఉంటుందా లోకం?

‘‘ఏదో ఓ పీరియాడికల్‌ డ్రామా చేసేద్దామని చేసేస్తే నిర్మాతతో పాటు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కథలో దమ్మున్నప్పుడే ఇలాంటివి చేయాలి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో అలాంటి బలమైన కథ ఉంది. నిజానికి ఇలాంటిసినిమాల్ని తెరపై ఆవిష్కరించడానికి మంచి కథ,నటీనటులు ఉంటే సరిపోదు. గత కాలాన్ని కళ్లకు    కట్టినట్లు చూపించగల ఆర్ట్‌ డైరెక్టర్‌ కావాలి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కావాలి. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించగల సినిమాటోగ్రాఫర్‌ ఉండాలి. ఈ చిత్ర విషయంలో ఇవన్నీ చక్కగా కుదిరాయి. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ఏదో సెట్లు వేశారు.. ఓ పీరియాడిక్‌ చిత్రం చూస్తున్నామన్నట్లయితే ఉండదు. నిజంగా 1970ల కాలంలో బెంగాల్‌లో ఉంటే ఎలా అనిపిస్తుందో.. అచ్చంగా అదే అనుభూతికి లోనవుతారు ప్రేక్షకులు. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నా’’.

ఈ గెటప్‌ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

‘‘ప్రత్యేకంగా కసరత్తులేం చేయలేదు. అందరూ నేనీ పాత్ర కోసం కాస్త బరువు పెరిగా అనుకుంటున్నారు. నిజానికి    నేనలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. ఉదయం పూట వాసు పాత్రను పూర్తి చేసి.. అదే రోజు మధ్యాహ్నానికి శ్యామ్‌ గెటప్‌లోకి వచ్చేశానంతే. పెద్ద టైం గ్యాప్‌ లేదు. అయితే బెంగాలీ కుర్రాడు ఎలా ఉంటాడు? వ్యవహార శైలి ఎలా ఉంటుంది? అన్నవి తెలుసుకున్నా. ఈ పాత్ర కోసం తెర వెనక ఆర్ట్‌,  కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్స్‌ వాళ్లు చాలా కష్టపడ్డారు’’.  

ఓటీటీకిచ్చిన సినిమాల ఫలితం పట్ల సంతృప్తిగా ఉన్నారా?

‘‘నేనే కాదు.. మా దర్శకులు, నిర్మాతలు, సినిమాని కొన్న ఓటీటీ సంస్థ.. అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. రెండు సినిమాలకు చాలా వ్యూయర్‌ షిప్‌ వచ్చిందని, కొత్త సబ్‌స్క్రిప్షన్లు  పెరిగాయని అమెజాన్‌ వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అందుకే మా తర్వాతి సినిమాలకు రెట్టింపు ఆఫర్‌ చేయడానికి సిద్ధమయ్యారు. దీన్ని సక్సెస్‌ కాదని ఎలా చెప్పగలం. నేను వరుస చిత్రాలు చేస్తుంటాను కాబట్టి.. ప్రత్యేకంగా థియేటర్‌ కోసం ఓ సినిమా దాయాల్సిన అవసరం నాకు లేదు. ఏరోజైతే థియేటర్లు రెడీ అవుతాయో.. అప్పటికి ఓ చిత్రంతో సిద్ధంగా ఉంటానని నాకు తెలుసు. కాబట్టి నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ నిర్మాత సంతోషంగా ఉండాలన్న దానిపైనే ఉండేది. సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి అనుండేది. దానికి తోడు వరుస సినిమాలు చేస్తుండటం వల్ల చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి ఆ పని ఆగకూడదనుకున్నా. అందుకే ఓటీటీలో రిలీజ్‌ చేస్తే  ఏమవుతుందని భయపడకుండా ముందుకెళ్లిపోయా’’.

సాయిపల్లవి, కృతిశెట్టిలతో పనిచేయడం ఎలా అనిపించింది?

‘‘కృతి సినిమాలో అద్భుతంగా చేసింది. తనకిది రెండో చిత్రమే. కాబట్టి సెట్లో ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటుండేది. సాయిపల్లవి నేను ‘ఎంసీఏ’లో కలిసి నటించాం. అందులో తనది చిన్న పాత్రే. ఆ పాత్రలు దాదాపు మా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఈసారి మేమిద్దరం కలిసి చేస్తే.. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉండాలనుకున్నాం. ఎంతో ఇంటెన్సిటీతో ఉన్న పాత్రలు చేయాలనుకున్నాం. ఈ సినిమాతో సరిగ్గా అలాంటి కథే దొరికింది. ఈ చిత్రంలో ఎక్కువగా సాయిపల్లవి మీదే బాధ్యతను మోపినట్లు ఉంటుంది’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయతో ‘అంటే.. సుందరానికి’ సినిమా చేస్తున్నా. 70శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘దసరా’ చిత్రం జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమా చాలా ‘రా’గా ఉంటుంది. తెలుగులో ఇంత వరకు ఎవరూ చేయని కథతో చేస్తున్నాం. ఒళ్లు గగుర్పాటు గురిచేసే అంశాలు చాలా ఉన్నాయి. నేనిందులో పక్కా తెలంగాణ యాసలో సంభాషణలు పలుకుతా’’.

ఇంతకీ ఈ చిత్ర కథేంటి? ఇందులో మీ రెండు పాత్రలు ఎలా ఉంటాయి?

‘‘ఇదొక ఎపిక్‌ లవ్‌స్టోరీ. రాహుల్‌ కథ చెప్పినప్పుడే చాలా నచ్చేసింది. దీన్ని అనుకున్నది అనుకున్నట్లు చూపించగలిగితే తప్పకుండా ఓ గొప్ప సినిమా అవుతుందని అప్పుడే ఫిక్సయిపోయా. అందుకే విన్న వెంటనే ఓకే చెప్పేశా. నేనిందులో వాసు అనే దర్శకుడిగా.. కమ్యునిస్ట్‌ భావజాలమున్న శ్యామ్‌ సింగరాయ్‌ అనే బెంగాలీ వ్యక్తిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తా. వాసు కథ వర్తమానంలో సాగుతుంటే.. శ్యామ్‌ కథ 70ల నేపథ్యంలో సాగుతుంటుంది. ప్రధానంగా ఈ శ్యామ్‌ కథ చుట్టూనే మొత్తం సినిమా తిరుగుతుంది. ఇందులో అతను చెడుకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా  కనిపిస్తాడు. ఆ చెడు రకరకాలుగా ఉండొచ్చు. అందులో దేవదాసీ వ్యవస్థ ఓ అంశమే. మరి కమ్యునిస్ట్‌ భావజాలమున్న శ్యామ్‌ ఆ దురాచారానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అసలతని ప్రేమకథేంటి? అన్నది తెరపై చూడాలి. కచ్చితంగా చెబుతున్నా సినిమా చూసి బయటకొచ్చాక.. ఓ అందమైన ప్రేమకథ చూశామని  సంతృప్తిగా ఫీలవుతారు. ప్రేక్షకుల్ని ఎమోషనల్‌గా కదిలించేవి.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేవి ఓ నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’.

ఇకపై పాన్‌ ఇండియా కథలతోనే ప్రయాణం చేస్తారా?

‘‘ప్రత్యేకంగా అలాంటి కథలతోనే వెళ్లాలని ఏమీ లేదు. కథా నేపథ్యాన్ని బట్టి దాన్ని ఎక్కడెక్కడ చెప్పొచ్చనేది   నిర్ణయించుకుంటా. ‘టక్‌ జగదీష్‌’ సినిమా ఉంది.. దాన్ని మిగతా భాషల్లో రిలీజ్‌ చేయమంటే అసలు చేయను. ఎందుకంటే అందులోని నేటివిటీ మిగతా భాషలకుసరిపడదు. అదే ‘జెర్సీ’లాంటి కథైతే.. పాన్‌ ఇండియా లెవల్లో చూపించొచ్చు. నేను నమ్మేది ఒక్కటే.. మన దగ్గర మంచి కథ ఉంటే చాలు సినిమా దానంతట అదే భాష హద్దులు చెరిపేసుకుంటూ వెళ్లిపోతుంది. మనం కష్టపడి బలవంతంగా పంపించాల్సిన అవసరం లేదు’’.

‘‘సిరివెన్నెల గారితో పాటలు రాయించడం మా అందరికీ ఓ ఎమోషనల్‌ మూమెంట్‌ అయింది. ఆయన ఈ చిత్రం కోసం ‘‘సిరివెన్నెల’’ పాట రాసి పంపాక.. దర్శకుడు రాహుల్‌తో ఫోన్లో మాట్లాడారట. నాకు తెలిసి ఇదే నా ఆఖరి పాట అన్నారట. నాకు రాహుల్‌ ఈ విషయం చెబితే.. మామూలుగా అన్నారేమో అనుకున్నా. నిజంగా అలా జరుగుతుందని ఊహించలేకపోయాం. సినిమాలోని రెండు పాటలకు ఆయన అద్భుతమైన సాహిత్యమందించారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ‘సిరివెన్నెల’ పాటలోనే ఆయన చిత్ర కథ మొత్తం చెప్పేశారు. సినిమా చూసొచ్చాక ఆ పాట వినండి.. అది మీకర్థమవుతుంది. అలా ఓ పాటలో కథ చెప్పగల లిరిక్‌ రైటర్‌ ఈ ప్రపంచంలో మరొకరు లేరు. నిజంగా ఆయన్ని కోల్పోవడం మనకు, చిత్రసీమకు తీరని లోటు’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని