హాంకాంగ్‌లో పురివిప్పిన కూచిపూడి నాట్య మయూరాలు

ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కూచిపూడి నాట్య నాటక నృత్యాన్ని ఘనంగా ప్రదర్శించారు.

Updated : 03 Jul 2023 22:38 IST

హాంకాంగ్‌: కూచిపూడి నృత్యం అనగానే చురుగ్గా లయ బద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, ముఖంలో పలికించే భావాలు గుర్తుకువస్తాయి. ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన కూచిపూడి నాట్య నాటక నృత్యాన్ని హాంకాంగ్‌లో తొలి సారిగా పరిచయం చేసిన స్థానిక కూచిపూడి నాట్యాచార్యులు ఈరంకి శ్రీహరి బాలాదిత్య తమ ఇద్దరు విద్యార్థుల నాట్యరంగప్రవేశాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. శిష్యులు సింథియా లావ్ మే 25న, జాకీ లా జూన్ 26న కూచిపూడి రంగప్రవేశం చేసి.. వారి  ప్రదర్శనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ రెండు కార్యక్రమాలను కుంటాన్గ్ క్రిస్టియన్ ఫ్యామిలీ సర్వీస్ సెంటర్ ఆడిటోరియంలో హరిఓం డాన్స్ సొసైటీ, చిల్డ్రన్స్ కల్చరల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మే 25న నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ప్రముఖ కథక్ గురువు శ్వేతా రాజపుత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. జూన్ 26న నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ప్రముఖ కథక్ గురువు నిషా ఝవేరి, కాన్సులర్ సర్వీసెస్ కాన్సుల్ కె. వెంకట రమణ, డాక్టర్ సంజయ్ నాగర్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ.. భారతీయ నాట్య శాస్త్ర ప్రాముఖ్యతను వివరించి, విదేశీయులు నేర్చుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. హాంకాంగ్‌లో పుట్టి పెరిగినా, మన భారతీయ కళలపై ఆసక్తితో మన తెలుగు సంస్కృతీ చిహ్నమైన కూచిపూడి నాట్యాన్ని 15 సంవత్సరాలుగా అభ్యసించి ప్రదర్శించడం ప్రశంసనీయమన్నారు.

జోయిచాన్, సిసిలియా చాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా కూచిపూడి నాట్యం ప్రదర్శిస్తున్న హాంకాంగ్‌ కళాకారులకి మేకప్ చేస్తూ అందరి ప్రేమ అభిమానాలు పొందుతున్నారు. మే 25 సింథియా లావ్ ప్రదర్శనలో పూర్వరంగం తరువాత సకల గణాధిప పాలయమాంతో ప్రారంభించి, అన్నమయ్య కీర్తన నందకధర, ధనశ్రీ తిల్లాన, రుక్మిణి ప్రవేశం, నాయక జావళి మరియు కూచిపూడి సలాము నృత్యాంశాలు ప్రదర్శించారు. జూన్ 26న జాకీలా ప్రదర్శనలో పూర్వరంగం తరువాత మామవతు శ్రీ సరస్వతితో ప్రారంభించి భామాకలాపంలో మూడు ముఖ్యాంశాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ప్రవేశ దరువు, సత్యభామ మాధవి సంభాషణ, మదన దరువు నయనానందకరంగా ప్రదర్శించారు. కూచిపూడి నేర్చుకొంటున్న మహిళల్లో చాలా మంది గృహిణిలు, ఉద్యోగులు ఉన్నారని ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి అన్నారు. వారికి మన కూచిపూడి నాట్యం పట్ల వున్న అభిమానం, నేర్చుకోవాలన్న ఆసక్తి, నిబద్ధత ప్రశంసనీయమన్నారు. దీనికి వారి గురువు శ్రీహరి కృషి కూడా కారణమని తెలిపారు. కళలకు, కళాకారులకు సరిహద్దులు లేవని, కళాభిమానానికి హద్దులు లేవని ఆమె అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని