Andhra News: సీఐడీ పోలీసులు నా కుమార్తెను బెదిరించి.. డ్రైవర్‌ను కొట్టారు: చింతకాయల విజయ్‌

ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన 41ఏ నోటీసుపై చింతకాయల విజయ్‌ సీఐడీకి లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్‌ తరఫు న్యాయవాదులు దాదాపు 4గంటల పాటు కార్యాలయంలోనే వేచి ఉన్నారు.

Published : 06 Oct 2022 18:08 IST

అమరావతి: ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన 41ఏ నోటీసుపై చింతకాయల విజయ్‌ సీఐడీకి లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్‌ తరఫు న్యాయవాదులు దాదాపు 4గంటల పాటు కార్యాలయంలోనే వేచి ఉన్నారు. అయినా అధికారులు లేఖ తీసుకోకపోవడంతో తప్పాల్‌లో ఇచ్చి వెళ్లారు. విజయ్‌కు ఏపీ సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులు చెల్లవని ఈ సందర్భంగా న్యాయవాదులు స్పష్టం చేశారు. ఆ నోటీసులో ఎలాంటి వివరాలు లేవని పేర్కొన్నారు.

తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీ, క్రిమినల్‌ కేసుల వివరాలు తెలపాలని విజయ్‌ లేఖలో కోరారు. తన నివాసంలోకి అక్రమంగా సీఐడీ పోలీసులు చొరబడ్డారని ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్‌ను కొట్టారని, తన పిల్లల్ని సంరంక్షించే వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌కు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ 41ఏ నోటీసులు ఇవ్వాలని.. ఇంట్లో పని మనుషులకు నోటీసు అందజేస్తే అది చెల్లదని ఆయన తరఫు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలేవీ నోటీసులో పొందుపర్చలేదని, కేవలం విజయ్‌.. అతని కుటుంబ సభ్యులను భయపెట్టేందుకే నోటీసులు ఇచ్చినట్టు కనిపిస్తోందన్నారు. విజయ్‌ తరఫున న్యాయవాదులగా తాము సీఐడీ కార్యాలయానికి వెళితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నాలుగు గంటల పాటు కార్యాలయంలోనే వేచి చూసినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, చేసేది లేక విజయ్‌ రాసిన లేఖను సీఐడీ కార్యాలయంలోని తప్పాల్‌లో ఇచ్చి వెనుదిరిగామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని