Andhra News: జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ

సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తే ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళ్తాడని వ్యాఖ్యానించారు.

Updated : 31 May 2023 20:32 IST

విశాఖ: సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తే ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళ్తాడని వ్యాఖ్యానించారు. జూన్ 7న జగన్ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ అంటున్నారని.. ఒకవేళ జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామన్నారు. ఈ మేరకు విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘ఐటీ రంగం కోసం మాట్లాడితే.. జగన్ ప్రభుత్వం ఉరేసుకోవాలి. ఏపీ 0.14 శాతమే ఐటీ ఎగుమతులు చేసింది. తెలంగాణ కంటే ఏపీ ఐటీ ఎగుమతులు చాలా చాలా తక్కువ. దీనికి జగన్‌.. తల ఎక్కడ పెట్టుకుంటారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా బూటకం.. జగన్ మాటలన్నీ అవాస్తవాలే. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి జరగలేదు. కానీ, సొంత మీడియాలో మాత్రం తెగ ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాలు, కేసుల విషయంపైనే జగన్ దిల్లీ వెళుతున్నారు. అమరావతిని కిల్ చేశారు.. అమర్ రాజా కంపెనీని వేధించి రాష్ట్రం నుంచి పంపించేశారు. కియా, జాకీ పరిశ్రమలది అదే దుస్థితి. దమ్ముంటే.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై వైకాపా నేతలు చర్చకు రావాలి’’ అని రామకృష్ణ సవాల్‌ విసిరారు.

వివేకా హత్య కేసు విషయంలోనూ రామకృష్ణ స్పందించారు. మూడేళ్ల నుంచి ఈ హత్య కేసు దర్యాప్తు చేయడానికి సీబీఐకి సిగ్గు ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని ఆరోపించారు. సీబీఐకి విలువ లేకుండా వైఎస్‌ అవినాష్ రెడ్డి చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని