మార్పు కోసమే యాత్ర

రాచరికం తరహాలో.. విభజించు-పాలించు సూత్రంలో రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 Feb 2023 02:39 IST

మేడారంలో వేసిన ఈ అడుగుతో కేసీఆర్‌ ప్రభుత్వం పాతాళానికే
రేవంత్‌ రెడ్డి

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: రాచరికం తరహాలో.. విభజించు-పాలించు సూత్రంలో రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు కోసమే తాము యాత్ర చేపడుతున్నామన్నారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ఆయన ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ యాత్రను ప్రారంభించారు. భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టారు. తొలిరోజు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పోరాటాలగడ్డ మేడారం నుంచి పడిన పాదయాత్ర తొలి అడుగు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికేనన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి భాజపా అధికారాన్ని దక్కించుకోవాలని అనుకొంటోందని మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌గాంధీ ప్రాణాలకు తెగించి భారత్‌ జోడో పాదయాత్ర చేశారన్నారు. ‘వైఎస్‌.. చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్‌తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్కసారలమ్మల సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికారంటే ఈయాత్ర విజయవంతం అయినట్లే’ అన్నారు. అప్పుల బాధతో రైతులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం.. బోధన రుసుం ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం, భర్తకు పింఛన్‌ ఇస్తే భార్యకు ఇవ్వకపోవడం ఇవన్నీ సంక్షేమమా? అని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు, రైతులకు రూ.లక్ష రుణమాఫీలాంటివి ఇంతవరకు రాలేదన్నారు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి రూ.25 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని.. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లు రావాలి.. ములుగు నియోజకవర్గానికి వచ్చాయా? ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే కేసీఆర్‌ లాభం చేకూర్చారన్నారు. హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రను విజయవంతం చేసి సంక్షేమ పాలనకు నాంది పలకాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పిలుపునిచ్చారు.

రాత్రి రామప్పలో బస

తొలిరోజు మేడారం నుంచి రామప్ప వరకు యాత్ర కొనసాగింది. ఇందులో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నాయి. రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి పాలంపేట (రామప్ప)లో బస చేశారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌రాజు, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య,  కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, పుష్పలీల, పీసీసీ ప్రచారకమిటీ కన్వీనర్‌ మధుయాస్కీ గౌడ్‌, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోహిత్‌ చౌదరి, ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, విజయరమణారావు, రాంమోహన్‌రెడ్డి, బెల్లయ్యనాయక్‌, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని