కేసీఆర్‌ కుటుంబంలోనే ప్రగతి కనిపిస్తోంది

తెలంగాణలో ప్రగతి కేసీఆర్‌ కుటుంబంలో మాత్రమే కనిపిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ ఆరోపించారు.

Updated : 06 Jun 2023 06:11 IST

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: తెలంగాణలో ప్రగతి కేసీఆర్‌ కుటుంబంలో మాత్రమే కనిపిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో బాల్కొండ నియోజకవర్గ భాజపా సీనియర్‌ కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన ‘జన్‌ సంపర్క్‌ అభియాన్‌’లో ఆయన మాట్లాడుతూ... ‘‘మొదట్లో రెండు ఎంపీ సీట్లే ఉన్న భాజపా ప్రస్తుతం 300కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంకితభావమున్న కార్యకర్తల కృషియే కారణం. ఈ తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి’’అని సూచించారు. అనంతరం ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ... అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత నాటి కరసేవకులను అక్కడికి తీసుకెళ్లి శ్రీరాముడి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పల్లె గంగారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, భూపతిరెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

రాహుల్‌వి పగటి కలలు: ఇంద్రసేనారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భాజపాను కనుమరుగు చేస్తామంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పగటి కలలు కంటున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... సొంతంగా కనుమరుగయ్యే ఆ పార్టీ భాజపా గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా లేని విషయాన్ని మరవొద్దని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్‌, భారాస, వామపక్షాలు కలసి పోటీ చేసినా భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని