దళిత మహిళను దారుణంగా హత్య చేస్తే ఇంత బాధ్యతారాహిత్యమా?

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలో హనుమాయమ్మ అనే ఎస్సీ మహిళను వైకాపా నాయకుల మద్దతుతో ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేస్తే... ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు.

Published : 08 Jun 2023 05:38 IST

డీజీపీ ప్రకటనపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలో హనుమాయమ్మ అనే ఎస్సీ మహిళను వైకాపా నాయకుల మద్దతుతో ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేస్తే... ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దర్యాప్తు ఏం జరిగింది? నిందితులెవరు? వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? వారిని ప్రోత్సహించిందెవరు? అధికార పార్టీ నాయకుల పాత్రేంటి? ఎందుకంత కక్షపూరితంగా చంపారు? పోలీసుల ప్రణాళిక ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డీజీపీ బుధవారం విడుదల చేసిన పత్రికాప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు. ఇది హత్యకేసు, పోలీసులు అరెస్టు చేస్తారు, అరెస్టు చేసినప్పుడు వారిని రిమాండ్‌కు పంపుతారు.. అంటూ ప్రకటనలో పేర్కొనడం డీజీపీ ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శనమని బుధవారం ఓ ప్రకటనలో వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మిషన్‌లో చెరుకుగడ నలగగొట్టినట్టు ఓ ఎస్సీ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపితే డీజీపీ ఆయన హోదా, స్థాయికి తగని రీతిలో స్పందించారు. ఈ ప్రభుత్వంలో దళితుల స్థానం, ప్రభుత్వ పరంగా వారి ప్రాధాన్యత ఏంటో ఆయన ఇచ్చిన పత్రికా ప్రకటనతో స్పష్టమైంది. ఎస్సీ మహిళ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయని అధికారులు కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం నేరస్థులని ఆయన గ్రహించాలి. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. మృతురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలి...’’ అని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

నిందితులను కాపాడుతున్నారు: కేఎస్‌ జవహర్‌

ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను వైకాపా నేత ట్రాక్టర్‌తో తొక్కి చంపడం రాష్ట్రంలో దళితుల పరిస్థితికి అద్దం పడుతోందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మండిపడ్డారు. ప్రాణాలు తీసే వారంతా వైకాపాలోనే ఉన్నారని.. జగన్‌ నిందితులను కాపాడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని