‘బాధ్యులైన పోలీసు అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా?’

‘ఏపీ సీఎం జగన్‌పై గులకరాయితో దాడి ఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఈ విషయంలో డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీసు కమిషనర్‌, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలి.

Updated : 16 Apr 2024 07:23 IST

ఇలా అయితే వారి లోపాలు ఎలా బయటపడతాయి
వారిని బదిలీ చేసి విచారణ చేపట్టాలి
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ‘ఏపీ సీఎం జగన్‌పై గులకరాయితో దాడి ఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఈ విషయంలో డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీసు కమిషనర్‌, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలి. వాళ్లు తీసుకున్న భద్రతా చర్యలలో లోపాలు ఏంటనేవి తేలాలి. అందుకు ముందుగా వారిని బదిలీ చేసి సచ్ఛీలురైన అధికారులతో విచారణ జరిపించాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించి ఎన్నికల సంఘానికి విన్నవించారు. ‘వీవీఐపీ కేటగిరీలో ఆ పాలకుడు ఉన్నందువల్లే కదా ఏ కార్యక్రమానికి వెళ్లినా పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్తు నిలిపివేసి చీకట్లో బస్సు యాత్ర చేయించారు. పరదాలు కట్టలేదు. చెట్లూ కొట్టలేదు’ అని పవన్‌ ప్రశ్నించారు. ఇటీవల మోదీ సభలోనే సెక్యూరిటీ పరమైన లోపాలు బయటపడ్డాయని.. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి పర్యటనకు వచ్చినప్పుడు ఇంతేస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారని మండిపడ్డారు. వీరితో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని పవన్‌ నిలదీశారు. దీనిపై ఈసీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి సారించాలని కోరారు.

జనసేన అభ్యర్థులకు రేపు బీఫాంల అందజేత

రాష్ట్రంలో జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బుధవారం పవన్‌కల్యాణ్‌ బీఫాంలు అందజేయనున్నారు. 20శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో వీటిని అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని