కేంద్ర మంత్రులకే రక్షణ కరవైతే ఎలా?

పశ్చిమ్‌బంగాల్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్‌పై దాడిని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కరవైతే రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని  కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు..

Published : 07 May 2021 01:41 IST

ప్రకాశ్‌ జావడేకర్‌

దిల్లీ: పశ్చిమ్‌బంగాల్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్‌పై దాడిని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కరవైతే రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని  కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ‘‘ కేంద్ర మంత్రిమంత్రి కాన్వాయ్‌పైనే దాడి జరిగిందంటే..బంగాల్‌లో ఇంకెవరు సురక్షితం. ఈ రాష్ట్రం హింసను ప్రేరేపిస్తోంది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని జావడేకర్‌ డిమాండ్‌ చేశారు. 

 పశ్చిమ్‌ మిడ్నాపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలే తనపై దాడికి దిగారని మంత్రి ఆరోపించారు. తన కారు అద్దాలు పగలగొట్టారని, తన వ్యక్తిగత సిబ్బందిపై భౌతిక దాడులకు దిగారని ఆయన అన్నారు. దాడికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మరోవైపు ఓట్ల లెక్కింపు తర్వాత పశ్చిమ్‌బంగాల్‌లో హింసాత్మక ఘటనలు ఎక్కువవుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారని, ఇప్పటి వరకు 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని